నందికొండ, అక్టోబర్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు శనివారం నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమె సమీపంలోని ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పూజలు నిర్వహించి నీటి విడుదలను ప్రారంభించారు. రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 10 రోజులపాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి కీసీఆర్ రైతుల పక్షపాతి అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు కోరిన విధంగానే ప్రతి ఏటా సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తున్నట్లు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ తెలిపారు. నందికొండ పొట్టిచెలిమె సమీపంలోని ఎడమ కాల్వ హెడ్ రెగ్యులెటర్ వద్ద పూజలు నిర్వహించి శనివారం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 9 ఏండ్లలో రెండు పంటలకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో వర్షాబావ పరిస్థితుల వల్ల నీరు సమృద్ధిగా లేకపోయినా ఎడమ కాల్వ ఆయకట్టు కింద వరి పొలాలు ఎండిపోవద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో నీటి విడుదలను చేపట్టినట్లు తెలిపారు. గతేడాది కృష్ణా బేసిన్లో నీరు పుష్కలంగా ఉండడంతో జూన్ నెలలో ఎడమ కాల్వకు నీటి విడుదల చేసి 2 లక్షల 98 వేల ఎకరాలకు నీరు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది కృష్ణానదిలో నీరు లేకపోవడంతో వర్షాలు పడుతాయని రైతాంగం ఎడమ కాల్వ కింద ఆయకట్టులో లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారని, వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో పొలాలకు నీరు అందించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు సీఎంను కోరారు.
దాంతో సీఎం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఎడమ కాల్వకు నీటి విడుదల చేపట్టారన్నారు. ఎడమ కాల్వకు 10 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. మొదటి జోన్ వరకు నీరు అందుతుందని, రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎన్ఎస్పీ ఎస్ఈ నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఎడమ కాల్వకు నీటి విడుదలను 500 క్యూసెక్కులతో ప్రారంభించామని, క్రమంగా పెంచుకుంటూ వెయ్యి నుంచి 4 వేల క్యూసెక్కుల వరకు వదులుతామన్నారు. ప్రతి రోజు 0.5 టీఎంసీల చొప్పున 10 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని ఎడమ కాల్వకు విడుదల చేస్తామని, మొదటి జోన్ వరకు నీరు అందుతుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం నీటి విడుదల కొనసాగుతుందన్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతం వారికి తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు నీటి విడుదలను ప్రారంభించామని, 5 టీఎంసీల వరకు నీటిని విడుదల చేస్తామని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ కర్న అనుశాశరత్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, కో ఆప్షన్ మెంబర్ బషీర్, ఎన్ఎస్పీ ఈఈ మల్లికార్జున, ఏఈలు కృష్ణయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.