రామగిరి, మార్చి 21 : ఏదుల రిజర్వాయర్ నుండి డిండి, పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టులకు ఎలాంటి వివక్ష లేకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలోని మగ్దూం భవనంలో శనివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుండి 440 మీటర్ల ఎత్తు నుంచే నీటిని తరలించే అవకాశం కల్పిస్తుండగా, డిండి ప్రాజెక్ట్కు మాత్రం 436 మీటర్ల ఎత్తు నుండి నీటిని తీసుకునేలా నిబంధనలు విధించడం నల్లగొండ జిల్లాపై జరుగుతున్న అన్యాయమన్నారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజినీర్లు అమసరిస్తున్న ద్వంద వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో కేవలం 58 రోజుల పాటు మాత్రమే డిండి కాలువకు నీరందే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీల నీటికి బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే నల్లగొండ జిల్లాకు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 1, 2న ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సీసీఐ బ్బందం సందర్శించి, ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిదులు, రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో వెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రెండు పంటల రైతు భరోసాను ఒకేసారి విడుదల చేయాలని, యూరియా కొరత తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో పాదదర్శకంగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ సీనియర్ నేత బొల్గురి నర్సింహ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఉదోని యాదగిరిరావు, సబ్బు వీరస్వామి, ఆర్.అంచదారి బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య టి.వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.