దామరచర్ల, డిసెంబర్ 18 : నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. బోర్లు వేసుకున్న రైతులు మాత్రమే ఎకరం నుంచి రెండెకరాల వరకు సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆరుతడి పంటలు వేశారు. వజీరాబాద్ మేజర్ కింద దామరచర్ల మండలంలోని కొండ్రపోల్, బండావత్తండా, బాలాజీనగర్, దిలావర్పూర్, కేశవాపురం, కేజేఆర్ కాలనీ, రాళ్లవాగుతండా, బొత్తలపాలెం పాత గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలు, గ్రామాల్లో వరి సాగు పూర్తిగా తగ్గిపోయింది. బోర్లు ఉన్న రైతులు మాత్రమే కొద్దిపాటి భూమిలో వరి సాగు చేస్తున్నారు. మిగతా రైతులు భూమిని ఖాళీగా ఉంచకుండా పచ్చజొన్న, మినుము, పెసర పంటలు సాగు చేస్తున్నారు. మండలంలో సుమారు 200 ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేస్తున్నట్లు అంచనా. మండలంలో గత ఏడాది సుమారు పది వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇప్పుడు సగానికి పడిపోయింది.
బోర్ల కింద పంటల సాగుతో కళకళలాడుతుండగా.. కాల్వ కింద భూములు వెలవెలబోతున్నాయి. మండలంలోని బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు చెరువులు కొంత ఊరటనిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితంగా చెరువుల్లో నీళ్లు ఉండటం, భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోస్తుండడంతో సమీప రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చాలా చోట్ల ఇప్పటికే నాట్లు సైతం వేశారు. అయితే.. కాలం కలిసి వచ్చి వానలు పడితే చెరువులు పూర్తిగా నిండితే యాసంగి పంటలకు ఢోకా ఉండదని, లేదంటే కొంత ఇబ్బంది అవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.