నేరేడుచర్ల, మే 2 : రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగడం, వడగాలులు వీస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా ఆయా గ్రామ పంచాయతీల్లో చర్యలు తీసుకోవాలని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ అదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎండ తీవ్రత, వడగాలులపై గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో పాటు చాటింపు వేయించాలని, ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలని, అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించేందుకు రోజూ నీళ్లు పోయాలని, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారి చేసింది. అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం ప్రజలు బయటకు రాకుండా ఉండేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.
ప్రజలకు అవగాహన
అధిక ఉష్ణాగ్రత, వడగాలుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని, ఒకవేళ బయటకు తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాటిపై గ్రామాల్లో చాటింపు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తప్పకుండా అధికారులు మిషన్ భగీరథ అధికారులను సమన్వయం చేస్తూ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధి పని ప్రదేశాల్లో మౌలిక వసతులు
ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనిచేసేలా కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. పనిచేసే ప్రదేశంలో టెంట్, నీటి వసతి కల్పిస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీ, పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి కూలీలతో పాటు గ్రామ ప్రజలు ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
హరితహారం మొక్కల రక్షణ
రోజు రోజుకు పెరుగుతున్న వేడితో హరితహారం మొక్కలు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. నాటిన మొక్కలు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు నీళ్లు పోయడంతో పాటు చలువను ఇచ్చేలా పందిళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రోజూ మొక్కలకు తప్పకుండా నీరు అందించాలని, చనిపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు
వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జారీ చేసిన ఆదేశాల మేరకు గ్రామాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నాం. ప్రజలకు, ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎండ, వడగాలుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు కూడా ఎండ సమయంలో బయటకు రాకపోవడం మంచిది. హరితహారం మొక్కలకు నీటిని అందించి సంరక్షించాలని ఆదేశించాం. – శంకరయ్య, ఎంపీడీఓ, నేరేడుచర్ల