నల్లగొండ, ఏప్రిల్ 28 : యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సిపిఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై టీఎస్ యూటీఎఫ్, సీఐటీయూ, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్లగొండ ఆధ్వర్యంలో పీపుల్స్ పోగ్రస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. సెమినార్ ను రాఘవులు ప్రారంభించి మాట్లాడారు. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ పై ఆక్రమిత యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తి అయ్యాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్య పెత్తనం సాగించాలని ఆకాంక్షతో వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేసి నిర్బంధించారన్నారు. ఇరాన్, వెనిజులా దేశాలలో ఉన్న చమరు నిల్వలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటంతో యుద్ధం ప్రారంభించారన్నారు. ట్రంపు చేస్తున్న యుద్ధాన్ని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుందని చెప్పారు.
భారతదేశ ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అమెరికా చెప్పుచేతల్లో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ట్రంప్ ఆదేశాలను పాటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు వేల సంవత్సరాల నుండి స్నేహ సబంధాలు ఉన్న ఇరాన్ తో పరస్పర వ్యాపార ఒప్పందాలను విరమించుకోవాలని, ట్రంప్ సూచించిన దగ్గర వ్యాపారం కొనసాగించాలని చెప్పడంతో విశ్వ గురువుగా చెప్పుకునే మోదీ విశ్వ బానిసగా మారిపోయారని అభివర్ణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందని, రాబోయే కాలంలో ఎరువుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలతో ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా నష్టం జరుగుతుందని మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం నేటికీ ఉందని దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా హిరోషిమా, నాగసాకి పట్టణాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ యద్ధ విమోచన కోసం ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం యుద్ధాలు కాదు కావాల్సింది శాంతి అన్నారు. శాంతి కోరుకున్న ప్రతిచోట ప్రశాంతంగా జీవనం సాగుతుందన్నారు. యుద్ధం అంటే మనుషులను చంపడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడమే కదా అని పేర్కొన్నారు.
ఈ సెమినార్ లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర రైతు మహిళా కన్వీనర్ కందాల ప్రమీల, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరమళ్ళ వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాల్లం మహేష్, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి కన్వీనర్ రాములు. టిఆర్టిఎఫ్ జిల్లా కార్యదర్శి తరాల పరమేష్, దండంపల్లి సత్తయ్య, లక్కపాక రాజు, అవుట రవీందర్, పెంజర్ల సైదులు, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, ఖమ్మంపాటి శంకర్ పాల్గొన్నారు.