వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాలను ఆకర్షణీయమైన లైటింగ్తో అలంకరించారు. గణనాథులను మేళ తాళాలతో వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి మండపాల్లో ఏర్పాటు చేశారు. దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు చేశారు. గణపతికి ప్రీతికరమైన ఉండ్రాలు, ఇతర నైవేద్యాలను సమర్పించి భక్తులు పూజలు చేశారు. నల్లగొండలో ఈ పర్యాయం 1,050 పెద్ద విగ్రహాలు అధికారికంగా ఏర్పాటు చేయగా పలు ప్రాంతాల్లో చిన్న విగ్రహాలు 250 పైగానే ఉన్నాయి. అయితే పెద్ద విగ్రహాల్లో 319 మట్టి విగ్రహాలు ఉండడం గమనార్హం.
గణేశ్ విగ్రహాల వద్ద ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద అన్నదానం, తీర్థ ప్రసాదాలను పంచి పెట్టారు. భక్తులు ఆది దేవుడైన గణపయ్యను దర్శించుకుని పులకించిపోయారు. కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ఆయా కమిటీల సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-రామగిరి, సెప్టెంబర్ 19