మిర్యాలగూడ, జూలై 14 : గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచుల పాలన ముగిసి సంవత్సరం దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ఏదో ఒక నెపంతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుందన్నారు. ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టబద్ధత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి 46 శాతం ఉన్న బీసీల జనాభాను 42 శాతానికి తగ్గించి మోసం చేసిందన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
హైకోర్టు సెప్టెంబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని మొట్టికాయలు వేసినప్పటికీ రిజర్వేషన్ల అమలును సాగదీస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు చూస్తున్నారన్నారు. పార్లమెంట్లో బిల్లు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ నిలబడదన్నారు. సీఎం రేవంత్రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు రాకూడదనే పెద్ద కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో బీసీలకు రూ.20వేల కోట్ల కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎంబీసీ వర్గాలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీసీ రిజర్వేషన్ల మీద డ్రామాలు ఆడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధిపొందాలని చూస్తుందని ఆరోపించారు.
రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చినప్పటికీ కొత్తగా ఏ ఒక్క కార్యక్రమాన్ని, కొత్త ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చెరువులను, కుంటలను ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. అదేవిధంగా నాగార్జునసాగర్కు పెద్ద ఎత్తున వరదనీరు వస్తుందని ఎస్ఎల్బీసీ ద్వారా నీటిని విడుదల చేసి నల్లగొండలోని అనేక చెరువులు, కుంటలు నింపేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ నల్లగొండను ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాకు నీరందించకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తుంటే రాష్ట్ర ఇరిగేషన్, జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చోద్యం చూస్తూ నల్లగొండ జిల్లా రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
దేవరకొండకు సంబందించిన డిండి ఎత్తిపోతల పథకానికి తిరిగి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, ఆనాడే కేసీఆర్ శంకుస్థాపన చేశారని, ఆయా రిజర్వాయర్ల పనులు 90 శాతం పూర్తయ్యాయని, తిరిగి అట్టి పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తుందని, దాన్ని జీర్ణించుకోలేకనే ఆమెపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అక్కసు వెల్లగక్కుతున్నారని, అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు తీన్మార్ మల్లన్న వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, నారాయణరెడ్డి, చిట్టిబాబునాయక్, బాలాజీనాయక్, హాతీరాం, మోసిన్అలీ, చిర్ర మల్లయ్యయాదవ్, యూసుఫ్, కట్టా మల్లేశ్గౌడ్, దుర్గా ప్రసాద్, ఇలియాస్ పాల్గొన్నారు.