మునుగోడు, జనవరి 24 : గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఊకొండి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహిళా తల్లుల కోరిన మాట ప్రకారమే బెల్టు షాపుల మూసివేత నిర్ణయమన్నారు. కార్యక్రమంలో బుచ్చమ్మ మహిళ తన కుమారులు తాగుడుకు బానిసలయ్యారని కన్నీరు మున్నీరుగా విలపించడంతో వెంటనే ఎమ్మెల్యే అక్కడికక్కడే గ్రామస్తులతో బెల్ట్షాపులు మూసివేయాలని ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కొంపెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫాండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఫాండేషన్ చెర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీరాజగోపాల్రెడ్డి ప్రారంభించారు. మరో మూడు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దంపతులకు గ్రామస్తులు,విద్యార్థులు ఘనస్వాగతం పలికి సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్,డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు,జాల వెంకటేశ్వర్లు, నడంపెల్లి యాదయ్య, నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, భీమనపల్లి సైదులు, అనంత లింగస్వామి గౌడ్, పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,మండల కాంగ్రె స్ నాయకులు పాల్గొన్నారు. అలాగే జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికలతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆసుపత్రి స్థాయిని పెంచాలని ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మె ల్యే కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చుకుందామన్నారు. అనంతరం పీఆర్టీయూ మునుగోడు శాఖ క్యాలెండర్ను ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆవిష్కరించారు.
మర్రిగూడ : మండలంలోని మేటిచందాపురంలో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.లెంకలపల్లిలో రూ.20 లక్షల నిధులతో నిర్మిస్తున్న ప్రైమరీ హెల్త్ సబ్సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధ్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
కొట్టాల గ్రామంలో సహస్ర వేదిక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, సర్పంచులు కొట్టం కవితాయాదయ్య, జంగిలి లక్ష్మీప్రసన్నా రవి, పాక నగేశ్ యాదవ్, ఎంపీటీసీలు ఊరిపక్క సరితానగేశ్ ,ఏర్పుల శ్రీశైలం,సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.