తుంగతుర్తి, ఏప్రిల్ 02 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక సభలలో ప్రజల భాగస్వామ్యం లేదని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో రెండుసార్లు ప్రజా పాలన పేరుతో హడావిడిగా సభలు నిర్వహించిందని ఆ సభలలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన దరఖాస్తులకు నేటికీ కూడా పరిష్కారం చూపలేదన్నారు. అందువల్లే నేడు నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజాధరణ కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైతే ఎక్కడ ప్రజలు నిలదీస్తారోననే భయంతో అధికారులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.