సూర్యాపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)/కోదాడ రూరల్/తిరుమలగిరి : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల్లో విజిలెన్స్, రెవెన్యూ, సివిల్ సప్లయ్, పోలీసు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు, సీఎంఆర్ ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వకపోవడం తదితరాలపై నమస్తే తెలంగాణ పత్రికలో వరుసగా ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. ఈ మేరకు తిరుమలగిరి మండల కేంద్రంలోని సంతోషి, నాగారం మండల పరిధిలోని రఘురామతోపాటు సూర్యాపేటలో జగన్మాత, కోదాడలో శ్రీవేంకటేశ్వర ఫార్బాయిల్డ్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేశారు. అదనపు కలెక్టర్ ప్రియాంక, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ,
సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ రాములు, డీఎస్ఓ మోహన్బాబుతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి మూడు ప్రాంతాల్లోని మిల్లుల్లో సోదాలు చేశారు. రికార్డులను పరిశీలించి ఆయా మిల్లులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ఎంత ధాన్యం వెళ్లింది? కస్టమ్ మిల్లింగ్ రైస్ను తిరిగి ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు? అనేది గుర్తించారు.
ఇంకా మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లెక్కలు తేల్చారు. ఆయా మిల్లుల్లో రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల విలువ చేసే ధాన్యం ఉండాల్సి ఉండగా పెద్దఎత్తున ధాన్యం మిల్లుల్లో కనిపించడం లేదని తెలిసింది. కోదాడలోని శ్రీ వేంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్లో 2022-23, 2023-24 సంవత్సరాలకు మూడు సీజన్లు కలిపి 21,300 టన్నుల బియ్యం ప్రభుత్వానికి పెండింగ్ ఉందని, దీని విలువ సుమారు రూ.90 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది మిల్లుల్లో ఉన్న ధాన్యం బస్తాలను లెక్కించడానికి మరో రోజు కూడా సమయం పడుతుందని, తదనంతరమే ఏయే మిల్లుల్లో ఎంత ధాన్యం ఉంది? తక్కువ ఎక్కడ ఉంది? అనే విషయాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. ప్రధానంగా గత రెండు సీజన్ల నుంచి ధాన్యం తీసుకొని ఒక్క కిలో కూడా బియ్యం ఇవ్వని 6 మిల్లులతోపాటు గతంలో సకాలంలో రైస్ ఇవ్వక డిఫాల్ట్ అయిన 32 మిల్లులపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం నాలుగు మిల్లుల లెక్క తేలనుండగా, ఆ వెంటనే మిగిలిన మిల్లుల్లో తనిఖీలు చేయనున్నట్లు సోదాల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు.