యాదాద్రి, జనవరి 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాతగుట్ట క్షేత్రంలో సోమవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ప్రధానాలయంలోని ఉత్తర ద్వారం గుండా ఉదయం 6:48 గంటలకు స్వామివారు వైకుంఠనాథుడిగా, పాతగుట్టలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు గంటన్నరపాటు వైకుంఠనాథుడి దర్శనభాగ్యం భక్తులకు కల్పించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. నమోఃనారసింహ అంటూ జయజయ ధ్వానాలు చేశారు. ఆదివారం రాత్రికే యాదాద్రికి చేరుకున్న భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులతో యాదాద్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మరోవైపు యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్టకు కూడా భక్తులు పోటెత్తారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ భానుప్రకాశ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్లానింగ్ కమిటీ సభ్యుడు జి.నర్సింగ్రావు, ప్రభుత్వ సలహాదారు భూపాల్రెడ్డి, ఐఏఎస్ అధికారి క్రిష్ణభాస్కర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆర్డీఓ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత తదితరులు స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు.
అధ్యయనోత్సవాలు ప్రారంభం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సోమవారం ఉదయం తొళక్కంతో అధ్యయనోత్సవాలను ప్రారంభించారు. ఉదయం స్వామివారు గరుఢ వాహనంపై వైకుంఠనాథుడిగా దర్శనమివ్వగా, మధ్యాహ్నం లక్ష్మీనరసింహస్వామివారి అలంకార సేవను ఊరేగించారు. సాయంత్రం విష్ణుమూర్తిని మత్స్యావతారంపై అలంకరించి సేవను ఊరేగించారు. అలంకార సేవలో ఆగమశాస్ర్తానుసారంగా స్వామివారిని పురప్పాట్ సేవగా ఊరేగింపు నిర్వహించారు. పశ్చిమ సప్తతల రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి సేవ ఆలయంలోని వెలుపలి ప్రాకార మండపంలో వేంచేపు చేశారు.
పోటెత్తిన భక్తులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తజనంతో ఉప్పొగింది. వేకువజామునే భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 6:48 గంటలకు గురుఢ వాహనంపై వైకుంఠనాథుడిగా నారసింహుడిని దివ్య మనోహరంగా అలంకరించి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. సుమారు గంటన్నర పాటు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం గరుఢ వాహనంపై వేంచేసిన వైకుంఠనాథుడిని తిరుమాఢవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఉత్తర ద్వారం గుండా తూర్పు మాఢవీధుల్లో సేవ కొనసాగింది. అనంతరం ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశింపజేసి వెలుపలి ప్రాకార మండపంలో వేంచేపు సేవకు ముగింపు పలికారు.