– మర్రిగూడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా
మర్రిగూడ, జనవరి 22 : యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుల బతికినట్లు తెలిపారు. గురువారం రైతులు యూరియా కోసం ఎదుర్కొంటున్న సమస్య పట్ల బీఆర్ఎస్ నాయకులు మర్రిగూడ మండల కేంద్రంలో మెరుపు ధర్నాకు దిగారు. ధర్నాతో వాహనాల రాకపోకలు గంట పాటు స్తంభించిపోయాయి. రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. చదువురాని రైతులు స్మార్ట్ ఫోన్లో యూరియాను ఎలా బుక్ చేసుకుంటారని మండిపడ్డారు. మొన్నటి వరకు పత్తి రైతులు స్లాట్ బుకింగ్తో ఇబ్బందులు పడి పతి పంటను దళారులకే విక్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీజన్ మొదలుకాగానే అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు ఎటుపోయిందని ప్రశ్నించారు.
పంటల సమయంలో రాని రైతు భరోసా ఓట్ల సమయంలో గుర్తుకు రావడం సిగ్గుచేటని విమర్శించారు. యాప్ లో కనిపించిన యూరియా షాపుల్లో ఎందుకు దొరకడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్తో ఆధార్ కార్డు పంపితే యూరియా ఇంటికి వచ్చేదని చెప్పారు. అదే ఆధార్ కార్డు ప్రామాణికంగా రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసాలు రెండు పర్యాయాలు ఎగ్గొట్టారని, బోనస్ కు దిక్కేలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం యాప్ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా స్థలానికి వచ్చిన మునుగోడు వ్యవసాయ సంచాలకుడు వేణుగోపాల్, ఏఓ సహస్, ఎస్ఐ కృష్ణారెడ్డికి రైతుల సమస్యలను వివరించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి యూరియా కష్టాలను తొలగించాల్సిందిగా నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు రాపోలు యాదగిరి, జిల్లా నాయకుడు చెరుకు శ్రీరామ్ గౌడ్, మాది ఆప్షన్స్ సభ్యులు ఎండి యాకూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి వట్టి కోటి శేఖర్, యూత్ అధ్యక్షుడు ఆంగోతు హరి ప్రసాద్ నాయక్, నాయకులు వనమాల మహేష్, పగడాల రఘు, నల్ల శేఖర్, పోలే సైదులు, బండ రమేష్, కొండాపురం నరేష్, మాద సత్తయ్య, గుణగంటి నగేష్, కోన్ రెడ్డి యాదయ్య, నల్ల వెంకటయ్య, మహేశ్వరం సోకయ్య, రైతులు పాల్గొన్నారు.

Marriguda : ‘యూరియా బుకింగ్ యాప్ను రద్దు చేయాలి’