నల్లగొండ/చిట్యాల/శాలిగౌరారం/మర్రిగూడ/ఆత్మకూర్.ఎస్. తిరుమలగిరి /బొడ్రాయిబజార్/ నాగారం మే 5 : గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ్డాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తోటల్లో మామిడి కాయలు, నిమ్మకాయలు కింద రాలాయి. పిడుగుపాటుకు ఒక వ్యకి చనిపోయాడు. ఎనిమిది పశువులు మృత్యువాత పడ్డాయి.
తాటి, కొబ్బరి చెట్లపై పిడుగులు పడి మంటలు చెలరేగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈ వర్షం ప్రజలతోపాటు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అడ్డగూడూరు మండలం కోటమర్తిలో పిడుగుపాటు వ్యక్తి చనిపోయాడు. ఒక బర్రె మృతి చెందింది. గుండాల మండలం తుర్కలషాపురం ఒక బర్రె, వలిగొండ మండలం వెంకటాపురంలో ఒక ఆవు, సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో రెండు ఆవులు, ఆత్మకూర్.ఎం మండలం పారుపల్లిలో ఒక ఎద్దు, చండూరు మండలం ఉడుతపల్లిలో ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. వర్షంతో వాతావరణం చల్లబడగా ఎండ వేడిమి నుంచి జనం ఉపశమనం పొందారు.
నల్లగొండ సిటీ, మే 5 : ఈదురు గాలుల వర్షానికి నల్లగొండ పట్టణంలో సుమారు 5 గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 : 30 గంటల వరకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్లను తొలగించక పోవడం తో ఈ సమస్య ఏర్పడింది. గతం లో ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవడంతో గాలిదుమారాలు వచ్చినా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడలేదు.