పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 4 : ఒకప్పుడు మెట్ట పంట అంటే ఏడాదంతా ఒక్కటే వేసేది. దిగుబడి రాకున్నా, ధర లేకున్నా రైతులు దిగాలు తీయాల్సిన పరిస్థితి. దాంతో రెండు సీజన్లలో పంట వస్తుందని ఎక్కువగా వరి సాగు వైపు మళ్లారు. కొన్ని చోట్ల మాత్రం ఒక రకం పంటపై ఆధార పడకుండా ఏదో ఒకటి కలిసి వస్తుందని ఏడాదిలోనే రెండు వేర్వేరు పంటలు పండిస్తున్నారు. పీఏపల్లి మండలంలో నీళ్లు ఉన్నప్పటికీ రెండు సీజన్లలోనూ మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. ఏఎమ్మార్పీ కాల్వ మోటర్లతోపాటు బోర్ల కింద కూడా వానకాలంలో పత్తి వేస్తున్నారు. అది పూర్తికాగానే యాసంగిలో మిర్చి పంట పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.
పీఏపల్లి మండలంలో రైతులు మొన్నటి వరకు వాణిజ్య పంట అయిన పత్తిపైనే పూర్తిగా ఆధారపడేవారు. కాలం కలిసి దిగుబడి వచ్చి.. ధర ఉంటే లాభం. లేదంటే పెట్టబడి కూడా వెళ్లని దయనీయ పరిస్థితి ఉండేది. కొన్నేండ్లుగా ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉండడంతోపాటు భూగర్భజలాలు పెరుగడంతో నీటికి కొదవ లేదు. అయినప్పటికీ అక్కడి రైతులు వరిపైనే ఆధార పడకుండా ఏడాదిలో రెండు మెట్ట పంటలు సాగు చేస్తున్నారు. వానకాలం సీజన్లో ముందస్తుగా జూన్లోనే వర్షాలు పడే ప్రారంభంలో పత్తి వేస్తున్నారు.
ఆరు నెలల్లో పత్తి పంట తీసుకుని నవంబర్లో దున్ని మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఒక పంటలో లాభం రాకున్నా.. మరో పంటలోనైనా వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. మండలంలో వానకాలంలో 23వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా.. ఈ నెలలో ఆ పంటను తీసేసి సుమారు 1500 ఎకరాల్లో మిర్చిని సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల అంచనా. మరికొంత మంది పత్తి వేయకుండా ప్రారంభంలో కూరగాయలు వేసుకుని ఆగస్టులో మిర్చి సాగు చేస్తున్నారు.
గత ఏడాది పత్తి ఎకరాకు ఎనిమిది క్వింటాళ్లకు పైగా దిగుబడి రాగా.. ఈ ఏడాది ఐదారు క్వింటాళ్లలోపే వచ్చింది. దీంతో పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి ఉండడంతో రైతులు మిర్చి పంటపై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది మిర్చి క్వింటాలుకు రూ.12వేల నుంచి రూ.14వేలు పలుకగా.. ఈ ఏడాది రూ.20వేలకు పైగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. మండలంలోని పీఏపల్లి, దుగ్యాల, మదారిగూడెం వంటి ప్రాంతాల్లో మిర్చి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దుగ్యాల గ్రామంలో అత్యధికంగా పత్తి పంటలోనే కాకుండా బత్తాయిలో కూడా అంతర్గత పంటగా మిర్చిని సాగు చేస్తున్నారు.
గత ఏడాది బత్తాయిలో అంతర పంటగా పత్తి సాగు చేసిన. ఈ సంవత్సరం వానకాలంలోనూ ఎకరంన్నరలో పత్తి వేసిన. కానీ ఈ సారి ఆశించిన దిగుబడి రాలేదు. ఇటీవల పత్తి పంట తీసేసి మిర్చి వేసిన. ఇందులోనైనా లాభం వస్తుందనుకుంటున్నా. నీటి వసతి ఉండడంతో ఏడాదిలో పత్తి, మిర్చి రెండు పంటలూ వేస్తున్నాం.
– రమావత్ కృష్ణ, పల్లిగుండ్లతండా
గతంలో ఆంధ్ర పాంతంలో నీటి వసతి ఉన్న మెట్ట భూముల్లో వానకాలంలో ముందుగా పత్తి వేసేది. అది ముగియగానే మిర్చి వేసేవారు. ఇప్పుడు మా ప్రాంతంలో చాలా మంది అదే పద్ధతి పాటిస్తున్నారు. మిర్చి ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.20వేలు ధర ఉంటే మంచి లాభం వస్తుంది. ఈ యేడు రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం మిర్చికి మంచి డిమాండ్ ఉంటుందంటున్నారు.
– మల్లెబోయిన ఆంజనేయలు, దుగ్యాల