సూర్యాపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/సంస్థాన్ నారాయణపురం, జనవరి 25 : టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారి, సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి యాదయ్య నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ విడుదల చేసింది. 1972 మే 6న నూతనకల్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన పాల్వాయి రాములు, భార్గవి దంపతులకు జన్మించిన రజినీకుమారి ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎల్ఎల్బీ, బీఈడీ పూర్తి చేశారు. తొలుత కొంతకాలం ప్రైవేట్ టీచర్గా పనిచేయగా, 2000 సంవత్సరంలో గ్రూప్-3 ద్వారా వీడీఓ ఉద్యోగం సాధించారు. తదనంతరం వీఓఆర్డీగా పదోన్నతి పొందారు.
అదే సంవత్సరం గ్రూప్-1కు ఎంపికై ఖైరతాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా, తాండూరు మున్సిపల్ కమిషనర్గా పని చేశారు. 2004 వరకు విధులు నిర్వర్తించిన ఆమె.. అదే సంవత్సరం ఉద్యోగానికి రాజీనామా చేసి సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె.. 2014లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2017లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి స్పోక్స్పర్సన్గా పని చేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం టీఎస్పీఎస్సీ మెంబర్గా ఎంపిక చేశారు.
మారుమూల గ్రామం నుంచి జేఎన్టీయూ హెచ్ రిజిస్ట్రార్ స్థాయికి నర్రి యాదయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి యాదయ్య ప్రస్తుతం జేఎన్టీయూ హెచ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామం మల్లారెడ్డిగూడేనికి చెందిన నర్రి దుర్గయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు యాదయ్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, సర్వేల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివారు. మలక్పేట ప్రభుత్వ కళశాలలో ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, 1988లో ఖరగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. 2000 సంవత్సరంతో జేఎన్టీయూ హెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి 200 z6లో ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. 1999లో యంగ్ సైంటిస్ట్ ఫెలోషిప్, 2015లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
దాదాపు 31 సంత్సరాలు ఉపాధ్యాయుడిగా పని చేసిన ఆయన.. ఎంసెట్, ఈసెట్కు రెండు సార్లు కన్వీనర్గా పనిచేశారు. 10 సార్లు రిక్రూట్మెంట్ పరీక్షల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 10 మంది పీహెచ్డీ, 80 ఎంటెక్ ప్రాజెక్టులకు నిర్దేశకుడిగా పని చేశారు. ప్రొఫెసర్గా, యంగ్ సైంటిస్ట్గా ఎన్నో రివార్డు లు, అవార్డులు అందుకుని అంచెలంచెలుగా ఎదిగి పదోన్నతులు పొందిన నర్రి యాదయ్య టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్గా ఎంపిక కావడంతో గ్రామస్తు లు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.