నల్లగొండ సిటీ, అక్టోబర్ 7: ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్పల్లి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, కోదాడ డిపోల ద్వారా అధికారులు 374 ప్రత్యేక సర్వీసులను నడిపించారు. కాగా ఆయా డిపోల పరిధిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు అప్పటికప్పుడే అదనంగా మరో 20 బస్సులను నడిపామని రూ 7.42 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు .
నష్టాల నుంచి లాభాల బాట పట్టేందుకు ఆర్టీసీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనతో ముందుకు వెళ్తున్నది. గతంలో పండుగ సమయాల్లో అధిక చార్జీలు వసూలు చేసే ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికులను ఆకర్షించేందుకు పాత చార్జీలనే అమలు చేస్తూ ప్రయాణికులు ఆదరిస్తున్నారు. గత నెల 24న రూ.కోటి 17 లక్షలు, 25న 89 లక్షలు, 30న రూ.కోటి, ఈనెల 1న రూ. కోటి14లక్షలు, 2న రూ. కోటి10 లక్షలు, 3న రూ.కోటి 11 లక్షలు, 4న రూ.కోటి 6 లక్షలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 7,8,9 తేదీల్లో కూడా ఆదాయం పెరగనున్నట్లు తెలిపారు.