యాదాద్రి భువనగిరి, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల కదన రంగంలోకి గులాబీ దళం అడుగుపెట్టనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. శుక్రవారం నుంచి మునుగోడులో పనిచేయాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే ఒక్కో ఎంపీటీసీ పరిధిలో లేదా మున్సిపాలిటీలో రెండు వార్డులకు ఒక నేతను యూనిట్ ఇన్చార్జిగా నియమించారు. దానికి సంబంధించిన జాబితా కూడా రూపొందించారు. వారంతా క్షేత్రస్థాయిలో ఓటర్లను కలువనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య, కుట్రపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు ముగిసే వరకూ ఇక్కడే ఉండి.. పరిస్థితులను చక్కదిద్దనున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుపు నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, దళిత సమ్మేళనాల పేరుతో గులాబీ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమవుతున్నాయి. ఇక ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కాగా నేటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగనున్నది.