బొమ్మలరామారం, జనవరి 29 : అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలం ఉదెమర్రి గ్రామంలోని వినాయక వైన్స్ క్యాషియర్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన సైబారాబాద్ పోలీసులు నిందితులను పట్టుకొనేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అందులో అల్వాల్ డిటెక్టివ్ ఎస్ఐ కిరణ్ కుమార్, మేడ్చల్ ఎస్ఐ సత్యనారాయణ, శామీర్పేట ఎస్ఐ మునిందర్, కానిస్టేబుల్ సతీశ్ బృందం ఒకటి.
వైన్స్ దోపిడీ కేసును విచారిస్తున్న ఈ బృందం దర్యాప్తులో.. వైన్స్లో దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యుడు మండలంలోని గద్దరాళ్లతండా వాసి భూక్య చందూనాయక్ ఇంట్లో కొద్ది రోజులు తలదాచుకున్నట్లు గుర్తించారు. గత మూడు రోజులుగా చందూనాయక్ కదలికలను పోలీసులు పరిశీలించారు. శనివారం రాత్రి అతన్ని విచారణ నిమిత్తం ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు పోలీస్ బృందం ప్రయత్నించగా.. అతడు తప్పించుకునేందుకు దొంగలు తనను కిడ్నాప్ చేస్తున్నారని, రక్షించమని గట్టిగా అరవడంతో గ్రామస్తులు మఫ్టీలో ఉన్న పోలీసుల వ్యాన్ను చుట్టుముట్టారు. తాము పోలీసులమని చెప్పినా వినకుండా తండావాసులు ఎస్ఐ తుపాకీ లాక్కొని కర్రలతో దాడిచేశారు. కారు టైరులో గాలి తీశారు. గాయపడిన వారిని గదిలో ఉంచి సజీవ దహనం కోసం ప్రయత్నించారు.
పోలీసుల బృందం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్థానిక ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో గ్రామం చేరుకొన్న పోలీసులు గ్రామస్తుల నుంచి దర్యాప్తు బృందాన్ని రక్షించారు. గాయపడిన అధికారులను చికిత్స కోసం లక్ష్మక్కపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పోలీస్ బృందంపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. ఎవరైనా అనుమానితులు గ్రామంలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భువనగిరి రూరల్ సీఐ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.