సూర్యాపేట, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే కలలను సాకారం చేసిన స్టడీ సర్కిళ్లు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైపోయాయి. ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, అదే స్థాయిలో స్టడీ సర్కిళ్లలో ఉచితంగా కోచింగ్ ఇచ్చి, వందలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన స్టడీ సర్కిళ్లు నేడు వెలవెల పోతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలు ప్రతి కుటుంబానికి దక్కేవి. ఏదో ఒక వర్గమో… జాతికో కాకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేవి. దీంతో తరతరాలుగా అట్టడుగున ఉండి, సాయం కోసం ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్న వర్గాల కోసం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం విదితమే. అందులో నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు ఒకటి. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయించారు. నాడు కొలువుల భర్తీకి ప్రకటనలివ్వడమే కాదు,.. పరీక్షలకు తయారయ్యేందుకు సర్కారే సాయం అందించేలా స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసి వివిధ బ్యాచ్ల ద్వారా 550 మంది వరకు లబ్ధి చేకూర్చారు.
తొలుత స్టడీ సర్కిల్లో ప్రతి అభ్యర్థికి నెలకు రూ.1500 చెల్లించగా కేసీఆర్ ఒకే సారి మెస్ చార్జీలను రూ.2250కు పెంచారు. దీంతో పాటు పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా ప్రతి ఒక్కరికి రూ.2500 విలువైన స్టడీ మెటీరియల్ను అందజేసేవారు. స్టడీ సర్కిల్లో ప్రతి బ్యాచ్కు 100 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా, అర్హత సాధించిన ప్రతి అభ్యర్థిపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా నోటు పుస్తకాలను ఉచితంగా ప్రభుత్వమే అందించింది. శిక్షణ పొందుతున్న వారికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు ప్రతి నెలా బాలికలకు రూ.150, బాలురకు రూ.100 అందజేశారు. తద్వారా శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడంతో వారి కలలు సాకారం కావడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది.
రెండేళ్లుగా తెరుచుకోని స్టడీ సర్కిల్..
సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్ రెండేళ్లుగా తెరుచుకోవడం లేదు. ఏదైనా ఉద్యోగాల కోసం ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైన తరువాత స్టడీ సర్కిల్లో అభ్యర్థులను తీసుకోవడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరి సారిగా 2023 ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల కాగా నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు పది బ్యాచ్లు పూర్తయ్యాయి. దీంతో సుమారు 550 మందికి ఎస్ఐ, గ్రూప్-2, గ్రూప్-4, కానిస్టేబుల్, బ్యాంకు, రైల్వే తదితర ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఇక రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియామకాలు పూర్తయిన అభ్యర్థులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వగా, ఒకటీ రెండు నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రెండు నెలల క్రితం స్టడీ సర్కిల్లో అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఫలితాలు మాత్రం విడుదల కాకపోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే శిక్షణ ప్రారంభించాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఉపకులాలకు ప్రతి సంవత్సరం ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నోటిఫికేషన్ రాలేదు. స్టడీ సర్కిల్ ప్రారంభించలేదు. దీంతో నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతున్నది. తక్షణమే స్టడీ సర్కిల్ ప్రారంభించి పేద విద్యార్థులకు శిక్షణ అందించాలి.
-భాషపంగు సునీల్, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి