కిలో రూ.80 పలుకుతున్న ధర
నేరేడుచర్ల, మే 18 : మార్కెట్లో టమాట ధర ప్రజలను ఠారెత్తిస్తున్నది. నెల క్రితం వరకు రూ.10 సైతం లేని కిలో ధర ప్రస్తుతం రూ.80 పలుకుతున్నది. మూడు రోజుల్లోనే రోజుకు రూ.10 చొప్పున ధర పెరగడం వినియోగదారులకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కొద్దిరోజుల్లో రూ.100 సైతం పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి
వేసవి ఎండలకు టమాట ఉత్పత్తి చాలా తగ్గింది. సాధారణం కంటే ఎండలు అధికంగా ఉండటంతో పూత రాక పంట తగ్గింది. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటకు నష్టం వాటిల్లింది. దీంతో హోల్సేల్ వ్యాపారులు దూర ప్రాంతాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. గతంలో సమీప ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన టమాట ప్రస్తుతం అనంతపురం, మహారాష్ట్రల నుంచి హైదరాబాద్కు వచ్చి అక్కడి నుంచి రిటైల్ వ్యాపారులకు వస్తున్నది. దీంతో టమాట రేటు పెరిగింది.అక్కడ టమాట సాగు చేసే రైతులు షేడ్ నెట్లు వేసి టమాటను సాగు చేస్తుంటారని దీంతో దిగుబడి వస్తుందని వ్యాపారులు తెలిపారు.టమాట ధర విపరీ తంగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయని, గతంలో రోజుకు 300 కేజీలు విక్రయిస్తే ప్రస్తుతం 100 నుంచి 15కేజీల టమాట విక్రయించడంలేదని కూరగాయల వ్యాపారి మధు తెలిపారు.