నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ)/ బీబీనగర్/చౌటుప్పల్ రూరల్, మార్చి 30 : ప్రతి సంవత్సరం మాదిరిగానే మరోసారి టోల్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధిమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజైన ఏప్రిల్ ఒకటి అర్థరాత్రి నుంచే పెరిగిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. జాతీయ రహదారులపై టోల్ చార్జీలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏయే వాహనానికి ఎంత పెంచాలో నిర్ణయించింది. టోల్ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనాలపై 5 నుంచి 6 శాతం వరకు అదనపు భారం పడనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలంలోని గూడూరు వద్ద టోల్ప్లాజా ఉన్నది. ఇక హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై చౌటుప్పల్ మండలంలోని పంతంగి వద్ద, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ హైవేపై ఏపీలోని చిల్లకల్లు వద్ద మరో టోల్ప్లాజాను కూడా జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్నది. జీఎంఆర్ నిర్వహించే ఈ మూడు టోల్ప్లాజాల ద్వారా ప్రస్తుతం సగటున రోజుకు రూ.90 లక్షల టోల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజా పెంపుదలతో అది కోటి రూపాయలకు చేరవచ్చని అంచనా. అర్థ్ధరాత్రి నుంచి పెరిగే టోల్ చార్జీలను ఇప్పటికే టోల్ప్లాజాల వద్ద సైతం ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని టోల్ ప్లాజాల మీదుగా నిత్యం 67 వేల వాహనాలు వెళ్తుంటాయి. ఇందులో బీబీనగర్ లో 27 వేలు, పంతంగి టోల్ ప్లాజాలో 40 వేల వాహనాలు వెళ్తున్నాయి. దాంతో ఆయా వాహనాలపై ఇక నుంచి ప్రతిరోజూ సుమారు రూ. 10 లక్షల అదనపు భారం పడనుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.1.20 కోట్ల టోల్ చార్జి అదనంగా వసూలు చేయనున్నారు.
పంతంగి టోల్ప్లాజా వద్ద
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్ప్లాజాల నిర్వహణ కొనసాగుతోంది. ఒక్కో ప్లాజా వద్ద వాహనాలు ప్రయాణించే సంఖ్యను బట్టి వేర్వేరుగా టోల్ రుసుమును వసూలు చేస్తున్నారు. ఈ మూడింటిలో అత్యధికంగా కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద ఎక్కువ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత చిల్లకల్లు, పంతంగి టోల్ప్లాజాలో కొంత తక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. పంతంగి టోల్ప్లాజా మీదుగా వద్ద నిత్యం 40 వేల వాహనాలు, కొర్లపహాడ్ మీదుగా 32 వేల వాహనాలు, చిల్లకల్లు టోల్ప్లాజా మీదుగా 20 వేల వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. దాంతో వీటిల్లో టోల్ప్లాజాలను బట్టి చార్జీల పెంపు కూడా వర్తించనుంది. సింగిల్ జర్నీకి పతంగి వద్ద గరిష్ట పెంపుదల రూ.30 కాగా కొర్లపహాడ్ వద్ద రూ.40గా ఉంది.
గూడూరు వద్ద ఇలా…
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని బట్టి కనీసంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.35 వరకు పెరిగింది. జీపు, వ్యాన్కు సింగిల్ జర్నీకి ప్రస్తుతం రూ.110 ఉండగా దానిని రూ.115కు పెంచారు. లైట్ కమర్షియల్ వెహికిల్కు రూ.165 నుంచి రూ. 175కు పెంచారు. బస్ లేదా ట్రక్కు రూ.340 నుంచి రూ.355కు, ఓవర్సైజ్ లేదా ఏడు అంత కంటే ఎకువ యాక్సిల్ ఉన్న వాహనాలకు సింగిల్ జర్నీకి రూ.665 ఉండగా, ఇప్పుడు రూ. 700కు ఎగబాకింది. దాంతో ఇక్కడి నుంచి నిత్యం ప్రయాణించే 27 వేల వాహనాదారులపై ఈ ప్రభావం పడనున్నది.
నెలవారీ పాస్లపైనా మోత
నెలవారీ పాసులకు పెంపుదల వర్తించనుంది. వీరికి కనిష్టంగా రూ.155 మొదలుకొని గరిష్టంగా రూ.1295 వరకు పెరుగనుంది. వీటి చార్జీలను ఐదు నుంచి ఆరు శాతం పెంచినట్ల స్పష్టం అవుతోంది. గరిష్ట టోల్ చార్జి ఉండే కొర్లపహాడ్ వద్ద నెలవారి పాసులపై అదనపు భారాన్ని పరిశీలిస్తే…. జీపు, వ్యాన్ లాంటి లైట్ మోటార్ వాహనాలకు ప్రస్తుతం రూ.4025 ఉంటే అది రూ. 4225కు పెరిగింది. లైట్ కమర్షియల్ వెహికిల్కు రూ.6385 నుంచి రూ.6710కు పెరిగింది. బస్ లేదా ట్రక్కు రూ.13240 నుంచి రూ.13910కు, హేవీ వెహికిల్స్కు రూ.20,530 నుంచి రూ.21,570వరకు, ఓవర్ సైజ్డ్ వెహికిల్స్కు రూ.25,545 నుంచి 26,840 రూపాయలకు నెలవారి పాసుల రుసుము పెరిగింది. గూడురు, పంతంగి, చిల్లకల్లు టోల్ప్లాజాల వద్ద కొర్లపహాడ్తో పోలిస్తే పెంపుదల కొంత తక్కువగా ఉండనుంది.
మండిపడుతున్న వాహనదారులు
కేంద్ర ప్రభుత్వం టోల్ చార్జీలు పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఓ వైపు కరోనా ప్రభావం, మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో వాహనాలు తిప్పుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు రంగంలో తీవ్ర సంక్షోభం ఆవరించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరుగకపోవడంతో ఫైనాన్స్లు, నెలవారీ వాయిదాలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడిపోయినా ఇక్కడ మాత్రం మోదీ సర్కార్ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించడం లేదు. పైగా సెస్సుల పేరుతో బాదుతూ వాహనదారులపై మరింత భారం మోపుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ఒక వైపు నిలదీస్తున్నారు. మరో వైపు టోల్ రుసుల పెంపుపైనా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ధరల పెంపుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయినా పెంపుదలపై కేంద్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో వాహనాదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. సామాన్యులను ఆర్థికంగా కుంగ దీయడమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గరిష్టంగా రూ.60 వరకు
టోల్ప్లాజాల మీదుగా ప్రయాణం చేసే అందరికీ ఈ ధరల పెంపుదల వర్తించనుంది. సింగిల్ జర్నీకి ఒక రేట్, డబుల్ జర్నీకి మరోరేటు వసూలు చేస్తుంటారు. సింగిల్ జర్నీ చేసే వాహనదారులపై రూ.5 మొదలుకొని గరిష్టంగా రూ.40 వరకు అదనపు భారం పడనుంది. కారు, జీపు లాంటి లైట్ మోటార్ వెహికిల్స్కు సింగిల్ లేదా డబుల జర్నీ అయినా ఐదు రూపాయల పెంపు వర్తించనుంది. అదే విధంగా ఓవర్సైజ్ వాహనాలకు గరిష్టంగా సింగిల్ జర్నీకి రూ.40, డబుల్ జర్నీకి రూ.60 వరకు పెంపుదల కనిపిస్తోంది.