నల్లగొండ, అక్టోబర్ 1 : యువ సారథి, రాష్ట్ర, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నల్లగొండలో ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రోడ్లు, జంక్షన్లు, పార్కులను ప్రారంభించనున్నారు. కళాభారతి, ఉదయం సముద్రం ట్యాంక్బండ్, శిల్పారామం, ఎన్జీ కళాశాల భవనం, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్, తాగునీటి పైపులైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే ప్రగతి నివేదన సభలో ప్రసంగించనున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపా ల్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించగా
అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. మంత్రి కేటీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రజలను, బీఆర్ఎస్
శ్రేణులను కోరారు.
నల్లగొండలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్లి అక్కడ పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నల్లగొండలో పర్యటించనున్నారు. పట్టణంలో రూ.249.32 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. మరో రూ.663.01 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. ఆ తర్వాత సాయంత్రం 5:30 నుంచి 6:30గంటల వరకు ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు ఆదివారం పర్యవేక్షించారు. ఎన్జీ కళాశాలతోపాటు ఐటీ హబ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అన్నెపర్తిలో హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే దగ్గరి నుంచి బహిరంగ సభ పూర్తయి మంత్రి కేటీఆర్ హైదరాబాద్ బయల్దేరే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు. ఆ మేరకు ఇప్పటికే తనిఖీలు చేయగా నేడు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు శంకుస్థాపన చేసే నల్లగొండలో రూ.663 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో అమృత్-2లో ఎస్టీపీ, యూజీడీ, మురుగు కాల్వలు (రూ.216.19కోట్లు), ఉదయ సముద్రం సుందరీకరణ (139.21 కోట్లు), మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి (రూ.45కోట్లు), శిల్పారామం (రూ.10.50కోట్లు), కళాభారతి (రూ.90.61కోట్లు), మిషన్ భగీరథ అర్బన్ అమృత్ 2.0 (రూ.56.75కోట్లు), ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్, ఆఫీసులు (రూ.12.25 కోట్లు), ఎన్జీ కాలేజీ బిల్డింగ్ (రూ.36కోట్లు), కమర్షియల్ కాంప్లెక్స్ (రూ.12కోట్లు), పట్టణంలోని 48 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి (రూ.55 కోట్లు) పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నింటికీ మంత్రి కేటీఆర్ నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ టూర్ షెడ్యూల్ సమయం కార్యక్రమం రూపాయలు
మధ్యాహ్నం 2:40 మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్కు శంకుస్థాపన రూ.45 కోట్లు
మధ్యాహ్నం 2:50 మర్రిగూడ జంక్షన్ వద్ద సెంట్రల్
లైటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సం రూ.146 కోట్లు
మధ్యాహ్నం 3:06 ఐటీ హబ్ ప్రారంభోత్సవం రూ.90 కోట్లు
మధ్యాహ్నం 3:15 ఐటీ హబ్ క్లయింట్స్, ఉద్యోగులతో మాటామంతి
మధ్యాహ్నం 3:45 పాల కేంద్రం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ
మధ్యాహ్నం 4:00 పాల కేంద్రం వద్ద చేనేత కార్మికులతో
సమావేశం, మరియు మగ్గం ప్రారంభోత్సం
మధ్యాహ్నం 4:30 బీట్ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభోత్సవం రూ.8.05 కోట్లు
మధ్యాహ్నం 4:45 క్లాక్ టవర్ సెంటర్లో కళాభారతి
ఆడిటోరియం శంకుస్థాపన రూ.90.61 కోట్లు
ఉదయ సముద్రం సుందరీకరణకు శంకుస్థాపన రూ.139.21 కోట్లు
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూ.55 కోట్లు
అమృత్ పథకం కింద నీటి సరఫరా పనులకు శంకుస్థాపన రూ.56.75 కోట్లు
యూజీడీ నిర్మాణానికి శంకుస్థాపన రూ.216.19 కోట్లు
ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మాణానికి శంకుస్థాపన రూ.6.25 కోట్లు
ఆర్ అండ్ బీ డివిజన్ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన రూ.6 కోట్లు
సాయంత్రం 5:00 వర్చువల్ ప్రారంభోత్సవాలు
సుభాష్ చంద్రబోస్ జంక్షన్ షల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ రూ.1.66 కోట్లు
రైతు బజార్ ప్రారంభం రూ.1.11 కోట్లు
అంబేద్కర్ జంక్షన్ రూ.0.50కోట్లు
సాయంత్రం 5:10 ఎన్జీ కళాశాల వద్ద వీధి వ్యాపారుల దుకాణ
సముదాయాల ప్రారంభం రూ.ఒక కోటి
సాయంత్రం 5:15 ఎన్జీ కళాశాల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన రూ.36 కోట్లు
సాయంత్రం 5:30 ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ
సాయంత్రం 6:30 సభ ముగింపు.. హైదరాబాద్కు పయనం