స్వరాష్ట్రంలో అన్ని రంగాలు ప్రగతిలో దూసుకుపోతున్నాయి. పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మౌలిక వసతుల పెరుగుదల, మెరుగైన పారిశుధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తున్నది. వివిధ పనుల కోసం మున్సిపాలిటీలకు ఠంఛనుగా నిధులు విడుదల చేస్తున్నది. 10శాతం గ్రీన్ బడ్జెట్, వెన్, నాజ్వెజ్ మార్కెట్లు, మినీట్యాంక్ బండ్, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు, పార్కులు, ఓపెన్ జిమ్లు తదితర నిర్మాణాలను చేపట్టింది. పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో కొత్తగా నిర్మించిన మహా ప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణాలకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పట్టణ ప్రగతి అవార్డును ప్రకటించింది. సూర్యాపేటలో మాత్రం అవార్డు సాధించిన మహా ప్రస్థానంలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఎస్ బీపాస్ చట్టం -2020 వ్యవస్థలో ఓ మార్పును తీసుకొచ్చింది. తక్షణ అనుమతులు, ఆమోదాలు, ఆన్లైన్ ధ్రువీకరణ కోసం ఒకే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫారంలో బిల్డింగ్, లేవుట్ అప్రూవల్స్తో సరికొత్త రికార్డు సృష్టించింది. టీఎస్ బిపాస్ ద్వారా నల్లగొండ మున్సిపాల్టీలో ఇప్పటివరకు 2101 దరఖాస్తులను పరిష్కరించారు. ప్రజల సౌకర్యార్థం ఇంటిపన్ను, నీటి బిల్లులు, ఇంటి రిజిస్ట్రేషన్, మోటేషన్, జనన, మరణ ధ్రువీకరణ సేవలను ఆనె్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఇప్పటివరకు 12414.38 లక్షల ఇంటిపన్ను, నీటి బిల్లులు లైసెన్స్ ఫీజులు మోటివేషన్ తదితర వాటిని వసూలు చేసి 67314 జనన, 11064 మరణ ధ్రువీకరణ పత్రాలను ఆనె్లైన్ ద్వారా జారీ చేశారు.
పట్టణ ప్రగతి..
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు విడుతల్లో నల్లగొండ పట్టణంలో 47.08 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. దీంతో రూ. 990.40 లక్షలతో 13 నర్సరీలు, 34 పట్టణ ప్రకృతి వనాలు, 15 పారులు, 51.35 కిలోమీటర్ల రెవెన్యూ మీడియం ఎంలాంప్ ప్లాంటేషన్ చేపట్టారు. రూ. 410.90 లక్షలతో 63 ఓపెన్ జిమ్లు, 6 వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేశారు.
మెరుగైన పారిశుధ్యం
తెలంగాణ రాక ముందు మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండేది. వీధులన్నీ చెత్తమయంగా దర్శనమిచ్చేవి. వర్షం వస్తే మురుగు కాల్వలు నిండి ఇండ్లల్లోకి నీరు వచ్చే పరిస్థితి. నల్లగొండ జిల్లా కేంద్రంలో కేవలం 200 మంది కార్మికులు మాత్రమే ఉండి, చెత్త తీసుకెళ్లేందుకు 48 వార్డులకు 50 వాహనాలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో వాహనాలను 105కు పెంచడంతో పాటు పారిశుధ్య సిబ్బందిని సైతం 700 మదికి పెంచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. శేషమ్మ గూడెంలో 22 ఎకరాల్లో కంపోస్ట్ షెడ్డు ఏర్పాటుతో పాటు పట్టణం నుంచి వచ్చే తడి పొడి చెత్తను వేరుచేసి ఎరువుగా మార్చేందుకు డీఆర్సీసీ ఏర్పాటు చేశారు. రూ.99.70 లక్షలతో 18 ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు.
తాగునీటి సమస్యకు చెక్
నల్లగొండ పట్టణంలో గతంలో వారానికి ఒక రోజు నీటిని సరఫరా చేయడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోయేవారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఎద్దడి తీరింది. ప్రస్తుతం పట్టణంలో 12900 కుటుంబాలకు నల్ల కలెక్షన్ ఇవ్వడంతో పాటు పైపులైన్లు, ట్యాంకులు ఏర్పాటు చేసి రోజు తప్పించి రోజు తాగు నీటిని అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజూ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక నిధులతో నల్లగొండ అభివృద్ధి
సీఎం కేసీఆర్ దత్తత తీసుకొని నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిదులను కేటాయించారు. పట్టణ సుందరీకరణ పేరుతో సుమారు రూ.1400 కోట్లను ప్రభుత్వం కేటాయించగా ప్రస్తుతం అభివృద్ధి పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1164.03 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.123.52 కోట్ల పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవే కాకుండా మరో రూ. 590.01 కోట్లు వివిధ పనులకోసం ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవే కాకుండా రూ.139.21 కోట్లతో పానగల్ ట్యాంక్బండ్ సుందరీకరణ, కట్టపై సెంట్రల్ లైటింగ్, సైకిల్ట్రాక్, ఓపెన్ డక్ట్, గ్రీనరీ పనులు, రూ.30 కోట్లతో ఎన్జీ కళాశాల భవన నిర్మాణం, రూ. 90.61 కోట్లతో కళాభారతి, రూ. 12.25 కోట్లతో ఆర్అండ్బీ అతిథిగృహం, రూ. 272.94 కోట్లతో అమృత్-2 పనులు వివిధ ధశల్లో ఉన్నాయి. పట్టణంలో అంతర్గత రోడ్ల కోసం మరో రూ.102.74 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో
మిర్యాలగూడ మున్సిపాలిటిలోని వివిధ పథకాల కింద 101.77 కోట్ల రుపాయలతో పార్కులు, జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్, వంతెనల నిర్మాణాలు, వైకుంఠధామాల అభివృద్ధి, ఖజరస్థాన్, ఇంటిగ్రేటేడ్ వెజ్,నాన్వెజ్ మార్కెట్ పనులు చేపట్టారు. దేవరకొండ మున్సిపాలిటీలో రూ. 66.35 కోట్లతో, చిట్యాల మున్సిపాలిటీలో 27.52 కోట్లు, నకిరేకల్లో రూ. 31.75 కోట్లు, చండూరు మున్సిపాలిటీలో రూ.19.12 కోట్లు, నందికొండ మున్సిపాలిటీలో రూ.65.10 కోట్లు, హాలియా మున్సిపాలిటీలో రూ.33.77 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు.
నేడు పట్టణ ప్రగతి దినోత్సవం..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు. మున్సిపాటిల్లో జెండావిష్కరణ చేపట్టనున్నారు. పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధులు వివరాలు, సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ధి, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించనున్నారు. పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీల రూపంలో, బ్రోచర్ల రూపంలో ప్రజలకు తెలియజేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ వెన్-నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పార్కుల గురించి ప్రజలకు వివరించనున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలు
పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు నిర్మించింది. నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 13 వైకుంఠధామాలను అభివృద్ధి చేశారు. దాంతో పాటు పార్థీవ దేహాలను అంత్యక్రియలకు తరలించేందుకు నాలుగు వైకుంఠరథాలను సైతం ఏర్పాటు చేశారు. రూ.27.27 లక్షలతో రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. 53.75 కిలోమీటర్ల రోడ్లు, 94.56 కిలోమీటర్ల డ్రైనేజీ, ఐదు జంక్షన్లు, 13 పారులు, 6 కమ్యూనిటీ హాళ్లను నిర్మించారు. దీంతో పాటు బీట్ మారెట్లో రూ.7.7 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మారెట్ నిర్మించారు. రూ. 250 లక్షలతో వల్లభరావు చెర్వును ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేశారు.
పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెంపు, మెరుగైన పారిశుధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఠంఛనుగా నిధులను విడుదల చేస్తున్నది. 10 శాతం గ్రీన్ బడ్జెట్, వెన్, నాజ్వెజ్ మార్కెట్ల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు, వైకుంఠధామాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు, పార్కులు వంటి నిర్మాణాలను చేపడుతున్నది. పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది.