నేరేడుచర్ల/మేళ్లచెర్వు/సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 8 : ప్రకృతికి రంగులద్దినట్టు అప్పుడే వచ్చిన మావి చిగుళ్లు, కుహూ.. కుహూ.. అంటూ సరాగాలు పలుకుతూ కోకిలలు, సువాసనలు వెదజల్లే పూలు, నక్షత్ర గమనానికి ఆది అయిన తెలుగు నూతన సంవత్సరం వచ్చేంది. నేడు శ్రీక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు ఉగాది పర్వదినాన్ని జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఇంటిల్లిపాది షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించనున్నారు.
ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ సందర్భంగా సోమవారం మార్కెట్లో పచ్చడి కుండలు, మామిడి కాయలు తదితర సామగ్రి కొనుగోళ్ల సందడి కనిపించింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రోధి నామ సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.