ఒక్కటే ఆశయం ఒక్కటే నినాదం
తెలంగాణ ఒక్కటే ఆశ.. ఒక్కటే విశ్వాసం కేసీఆర్
ఆకాంక్షల వీలునామాను అందుకుని స్వరాష్ట్ర సాధనతో కేసీఆర్ తెలంగాణకు చిరునామాగా నిలిస్తే..గులాబీ జెండాను గుండెలకు హత్తుకుని జనం పట్టాభిషేకం చేస్తున్నది.2001 ఏప్రిల్ 27నాటి జల దృశ్యం మొదలు ప్రతి అడుగులోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా సీఎం కేసీఆర్ వెంట నడుస్తున్నది. జిల్లా వేదికగా సాగిన టీఆర్ఎస్ తొలి ప్లీనరీ, కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు రాజీనామాల మొదలు పాదయాత్రలు, బస్సుయాత్రలు, పల్లెనిద్రలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలకు హారతి పట్టింది. 2014 నాటి సమరభేరి వంటి సభలకు వేదికగా నిలిచింది. తెలంగాణ కోసం కాసోజు శ్రీకాంతాచారిని తొలి సమిధగా అర్పించుకున్నది. దాడులు, దౌర్జన్యాలు, కేసులు, నిర్బంధాలకు వెరవక కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేసింది. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ నాయకత్వానికి జిల్లా ప్రజలు జై కొడుతున్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్కే పబ్బతి పడుతున్నారు. అభివృద్ధి , సంక్షేమ ఫలాలనూ అగ్రభాగాన పొందుతున్నారు. సాగు, తాగునీటితోపాటు విద్య, వైద్యం, విద్యుత్, ఆధ్యాత్మిక రంగాల్లో అపార అవకాశాలను అందిపుచ్చుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ కరువు ఛాయలను తుడిపివేసుకుంటున్నది
స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు అడ్డాగా నిలిచింది… పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా. అప్పట్లో వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్ర సాధనలోనూ తనదైన పాత్రను పోషించింది. సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమనేత, తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమర శంఖం పూరించగా జిల్లా ప్రజలు వెన్నంటి నడిచారు. జిల్లా వేదికగా సాగిన తొలి ప్లీనరీ, కేసీఆర్ సహా మిగతా ప్రజాప్రతినిధుల రాజీనామాలు మొదలుకుని పాదయాత్రలు, బస్సుయాత్రలు, పల్లెనిద్రలు ఇలా ఎన్నో కార్యక్రమాలకు జిల్లా వేదికగా నిలిచింది. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన కాసోజు
శ్రీకాంతాచారి కూడా జిల్లా వాసి కావడం గర్వకారణం. ఇదే సమయంలో ఎందరో సామాన్యులు సైతం దాడులు,
దౌర్జన్యాలు, కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేయడమే లక్ష్యంగా అగ్రభాగంలో నిలిచారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ జిల్లా ప్రజలు వెన్నంటి నడుస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక నల్లగొండ జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సాగు, తాగునీటితో పాటు విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విజయాలను సొంతం
చేసుకున్నది. వెనుకబడిన జిల్లా అనే ముద్రను తుడిచివేస్తూ సమగ్రాభివృద్ధి దిశగా ఉమ్మడి నల్లగొండ పరుగులు తీస్తున్నది. నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా వాడవాడలా పార్టీ పతాకాన్ని ఎగురవేసేందుకు శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డుల్లోనూ పార్టీ పతాకాల ఆవిష్కరణకు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం తెలిసిందే. ఈ మేరకు సంస్థాగత నిర్మాణంలోని అన్ని పార్టీ, అనుబంధ కమిటీల సభ్యులతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్స్, కోఆపరేటివ్ డైరెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులు, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులంతా జెండా ఆవిష్కరణల్లో పాల్గొనేలా ఆదేశాలిచ్చారు. బుధవారం ఉదయం 9 గంటలకు అన్ని చోట్ల ఊరేగింపుగా వెళ్లి టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులన్నీ సమాయత్తమయ్యాయి.
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా 2001 సంవత్సరంలో కేసీఆర్ నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 21వ వార్షికోత్సవానికి సిద్ధమైంది. 13ఏండ్లు ఉద్యమపార్టీగా ఆ తర్వాత పాలన పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు నెలవుగా మారింది. ఉద్యమకాలంలో నినాదాలుగా ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్రతో అతి పెద్దగా పార్టీగా అవతరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు ఆరున్నర లక్షల మంది సభ్యులతో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించింది. సంస్థాగత నిర్మాణ పరంగానూ పటిష్టమైన పార్టీగా అగ్రభాగంలో నిలిచింది. ప్రతి ఆవాసం, మారుమూల తండా, బస్తీ గల్లీకి సైతం గులాబీ జెండా విస్తరించింది. పార్టీ లేని ఏరియా లేదంటే అతిశయోక్తి కాదు. 2014తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయబావుటా. 2014లో ఆరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానంలో విజయకేతనం ఎగురవేసిన పార్టీ.. 2018 ఎన్నికల్లోనూ 9 స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజార్టీతో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. ఉద్యమ సమయంలో, స్వరాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలువడంలో నల్లగొండ జిల్లా ప్రత్యేకత చాటుతున్నది.