ఆలేరు, నవంబర్ 13 : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కార్యచరణ ఉన్నందున అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆలేరులో సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ తరువాత అంతగా ఆలోచించిన మేధావి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళితుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దళితులంతా పూర్తి మద్దతు అందించి వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ విజయానికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో అంటూ మోసం చేసిన బీజేపీ, వర్గీకరణ చేపట్టకుండా మాదిగ యువకుల ప్రాణాలను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీలకు మాదిగ, మాదిగ ఉప కులాలు ఒక్క ఓటు సైతం వేయవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే వర్గీకరణ అంశం కనుమరుగు అవుతుందన్నారు. బీజేపీ వస్తే మాదిగలపై అత్యాచారాలు కొనసాగుతాయన్నారు.
మనువాద పార్టీ బీజేపీని ఎప్పటికీ నమ్మవద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వం మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ రాజకీయ ప్రసంగం తప్ప, మాదిగ జాతికి ప్రయోజనం గురించి మాట్లాడలేదని, కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వర్గీకరణ పై ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండి పడ్డారు. బీజేపీ వర్గీకరణ చేయకపోగా దేశంలో దళితులపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఉన్నందునే మాదిగల ఓటు బ్యాంకులా వాడుకోవడానికి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయన్నారు. వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపి మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. దళితులంతా ఐక్యంగా ఉద్యమించి కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు.
వంగపల్లి మద్దతుతో మారనున్న సమీకరణాలు
బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డికి టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మద్దతు ప్రకటనతో ఆలేరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మాదిగలతో భారీ సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్కే ఓట్లు పడేలా వంగపల్లి వ్యూహాలు పన్నుతున్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమే
కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమేనని, ఆలేరు ప్రాంతమంతా అంధకారంలోకి వెళ్తుందని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి రేటెంతరెడ్డిగా మారాడని ఆరోపించారు. టికెట్లు అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించే రేవంత్రెడ్డి రేపు రాష్ర్టాన్ని సైతం అమ్ముతాడని మండిపడ్డారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్, గంగుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యుడు చిలుకమారి గణేశ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్, నాయకులు గ్యాదపాక మల్లేశ్, గంగాపురం రాములు, గొల్లూరి ప్రభాకర్, రాజాపేట, గుండాల, మోటకొండూర్ మండలాల అధ్యక్షులు నత్తి కిష్టయ్య, పి.పరుశరాములు, వంగపల్లి ఉప్పలయ్య, కొల్లూరు మొగులయ్య, మీసాల ఉప్పలయ్య, ఎర్ర విజయ్, సుధాకర్, కొల్లూరు హరిబాబు, బొట్ల జహంగీర్, రాజు, బీఆర్ఎస్ నాయకులు మొరిగాడి వెంకటేశ్, దాసి సంతోశ్, ఆడెపు బాలస్వామి, పంతం కృష్ణ, జంపాల దశరథ, పత్తి వెంకటేశ్ పాల్గొన్నారు.