యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 11 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు జరిపారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. నిజరూప దర్శనంలో నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు జరిపించారు. స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు వైభవంగా చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.46,87,423 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
లక్ష్మీనరసింహ స్వామిని జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.