యాదగిరిగుట్ట, మార్చి 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం సోమవారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయానికి అనుబంధమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.27,16,337 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరీశుడిని దర్శించుకున్న త్రిపుర మాజీ సీఎం లక్ష్మీనరసింహ స్వామిని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు బిప్లబ్ కుమార్ దేబ్ దర్శించుకున్నారు. సోమవారం కొండకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు.