దామరచర్ల, జూన్ 09 : రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో మంగళవారం జరిగింది. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు (38) ఇరువురు బైక్పై డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్తుండగా లారీ యార్డు వద్ద దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (25) మోటార్ సైకిల్ పై ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వెంకటేష్ సైతం మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం నరసింహారావును నల్లగొండ తరలిస్తుండగా అతను సైతం మార్గమధ్యంలో మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించడంతో మండలంలో ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. సమాచారం అందుకున్న వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.