ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వివిధ పార్టీలు, కష్టజీవుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు. స్వరాష్ట్రంలో స్వశక్తితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రతిభ చాటి వివిధ శాఖల్లో కొలువుదీరారు. వాళ్లంతా చెప్పింది ఒక్కటే. పైరవీలకు తావు లేకుండా, ఎక్కడా పైసా ఇవ్వకుండా మేం ఉద్యోగం సాధించాం. చెప్తున్నదీ ఒక్కటే. ఎవరూ రాజకీయ స్వార్థం కోసం ఉద్యోగార్థుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీయొద్దని. కొద్దిమంది స్వప్రయోజనాల కోసం గందరగోళాలు సృష్టిస్తున్న నేపథ్యంలో తాము ఉద్యోగం సాధించిన తీరును స్ఫూర్తిగా చాటుతున్నారు.
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బిల్యానాయక్తండా. నేను పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టా. మా నాన్న రైతు, అమ్మ అంగన్వాడీ టీచర్. అమ్మనాన్న కష్టాలు చూసి నేను, తమ్ముడు చదువుకు అంకితమయ్యాం. ఓయూలో పీజీ చేస్తుండగా 2016లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. నాలుగు నెలలు కోచింగ్ తీసుకొని గ్రూప్-2 పరీక్ష రాసిన. ఫలితాలు వచ్చేందుకు లేటయ్యింది. ఇంతలో నాకు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. మఠంపల్లి మండలంలో 9నెలలు ఉద్యోగం చేశా. తర్వాత గ్రూప్-2 రిజల్ట్ వచ్చింది. కామారెడ్డి జిల్లా కొడపగల్ మండలంలో డీటీగా పోస్టింగ్ వచ్చింది. అదే సంవత్సరం మా తమ్ముడికి ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. నల్లగొండలో జాయిన్ అయి ఉద్యోగం చేస్తున్నాడు. పరీక్షల నిర్వహణలో లోపాలు లేవు.
– బాణోతు భరత్నాయక్, డీటీ, పెద్ద కొడపగల్(మం), కామారెడ్డి జిల్లా (మఠంపల్లి వాసి)
స్వతంత్ర సంస్థ అయిన టీఎస్పీఎస్సీ సమర్థంగా నడుస్తున్న కమిషన్. పైరవీలకు తావు లేకుండా పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో ఎన్నో రిక్రూట్మెంట్లు నిర్వహించి నిఖార్సైన కమిషన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బోర్డు నిర్వహించిన అనేక పోటీ పరీక్షల్లో కష్టపడ్డోళ్లకే కొలువులు దక్కాయి. అనేక మంది పేదలు, వివిధ పార్టీల నాయకుల పిల్లలు ఉద్యోగాలు సాధించారు. నోటిఫికేషన్ మొదలు నియామకాల వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైంది. కానీ.. ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ ఘటనపై ప్రతిపక్షాలు, సంఘాలు బురదజల్లే ప్రయత్నం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. వాటి తీరును గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినవారు ఖండిస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, మార్చి 20 (నమస్తే తెలంగాణ)
పారదర్శకంగా ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం
టీఎస్పీఎస్సీ పారదర్శకంగా నిర్వహించిన నియామకాల్లో నేను ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం సాధించా. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేను సర్కారు కొలువు సాధించాలని కష్టపడి చదివా. 2015లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. 2016లో గ్రూప్ పరీక్ష రాశా. కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో కొంత ఆలస్యమైంది. అప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేపట్టడంతో పైరవీలకు తావు లేకుండా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అక్రమాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంపికలు జరిగాయి. ఇప్పుడు తంగతుర్తిలో విధులు నిర్వహిస్తున్నా.
– కడారి గణేశ్, ఎక్సైజ్ ఎస్ఐ (గోనబోయినపల్లి, డిండి మండలం)
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు ఢోకా లేదు
మాది నేరేడుచర్ల మండలం ఘంటావారిగూడెం. మా నాన్న సాధారణ రైతు. నన్ను కష్టపడి చదివించారు. నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంజినీరింగ్లో ట్రిపుల్ ఈతో పాటు ఎంటెక్ చేశా. ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తుండడంతో సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్లకుండా ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టా. గతంలో విద్యుత్ ఏఈ పరీక్షలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం కొల్పోయా. అయినా ప్రయత్నం మానకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేశా. 2019లో పంచాయతీ సెకట్రరీ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే ప్రస్తుతం బ్యాంకింగ్, జేఏఓ, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా. రానున్న రోజుల్లో మంచి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. టీఎస్పీఎస్సీలో కొందరు స్వార్థపరుల అత్యాశ, ఇతర ప్రలోభాల వల్ల పేపర్ లీకేజీ జరిగింది. దానిని రాజకీయ పక్షాలు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం బాధగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు అపోహలకు గురవకుండా చిత్తశుద్ధితో చదివితే తప్పక విజయం సాధించవచ్చు.
– రావుల నరేందర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, శూన్యపహాడ్
పుకార్లు నమ్మొద్దు.. నా కొడుకే నిదర్శనం
మా అబ్బాయి 2014లో తెలంగాణ రాష్ట్రం ఎస్ఐగా కొలువు సాధించాడు. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ఇంటి వద్దే ఉండి రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివిండు. టీఎస్పీఎస్సీ ద్వారానే నిజాయితీగా పరీక్షలు జరుగుతాయి. కష్టపడి చదువుకున్న వారికే ఉద్యోగాలు వస్తాయి. అందుకు నా కొడుకే నిదర్శనం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇతరులు చెప్పే పుకార్లను నమ్మకుండా చదువు మీద ధ్యాస పెట్టాలి. మున్ముందు చాలా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి.
– మలిగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కుక్కడం, మాడ్గులపల్లి మండలం
గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించడమే లక్ష్యం
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎంతో కష్టపడి చదివా. నిరంతర అభ్యాసం, కసితో 2019లో ఉద్యోగాన్ని సాధించా. నా లక్ష్యం గెజిటెడ్ ఆఫీసర్ కావాలనేది. అందుకోసం ఎంతగానో ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి భువనగిరి మండలంలోని ఎర్రంబల్లి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నా. నందనం గ్రామానికి చెందిన నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాను. గెజిటెడ్ ఆఫీసర్ను అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతున్నా. తెలంగాణ ప్రభుత్వంలో గెజిటెడ్ అధికారి ఉద్యోగం సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నా.
– కొండాపురం అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి, ఎర్రంబల్లి (భువనగిరి కలెక్టరేట్)
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
మాది మధ్య తరగతి చేనేత కుటుంబం. విద్యాభ్యాసమంతా చౌటుప్పల్లోనే జరిగింది. 2003లో డిగ్రీ, 2006లో బీఈడీ పూర్తి చేశా. 2008లో పల్లెర్లకు చెందిన ఏలె చిలుకమ్మతో పెండ్లి జరిగింది. ఆమె కూడా ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. అప్పటి నుంచి ఇద్దరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేరవుతూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2018లో నా భార్యకు మొదటి ప్రయత్నంలోనే సోషల్ వెల్ఫేర్లో ఉద్యోగం వచ్చింది. నాకు 2019లో ఫారెస్ట్ ్టరేంజర్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నేను చౌటుప్పల్, నారాయణపురం మండలాల పరిధిలో ఫారెస్టు రేంజర్గా విధులు నిర్వహిస్తున్నా.
– గోశిక లక్ష్మణ్, ఫారెస్ట్ రేంజర్, చౌటుప్పల్
పరీక్ష సజావుగా ఉద్యోగం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు సజావుగా పరీక్షలు నిర్వహిస్తున్నది. అందుకే నాలాంటి వారు చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2016లో టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాన్వేషణలో ఉన్న నేను పట్టుదలతో చదివి పరీక్షకు హాజరయ్యాను. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన నాకు రెవెన్యూ శాఖలో డీటీ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం కోసం నేను పైసా ఖర్చు చేయలేదు. పైరవీలు చేయలేదు. టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించడం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది.
– అత్తి అనిత, డీటీ, నాగర్కర్నూల్