చండూరు, జూలై 02 : బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చండూరు పట్టణ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ తోకల వెంకన్నకు చెందిన భవనాన్ని సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పతనానికి నాంది అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సహకారంతో చండూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. కానీ ఇప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఉన్న నిధులను సద్వినియోగం చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పరిపాలనను పక్కకు పెట్టి తుగ్లక్ అరాచకాలకు తెరలేపుతున్నాడని, ఇకనుంచి ఆయనను తుగ్లక్ రాజగోపాల్ రెడ్డిగా పిలవాలన్నారు.
రాజగోపాల్ రెడ్డి మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు వెడల్పు పనులకు డీపీఆర్ లేకుండా ఒక దగ్గర 95 ఫీట్లు అని, ఇంకో దగ్గర 90 ఫీట్లు అని, వారి అనుచర గణానికి, ముడుపులు ముట్టిన చోట 85 ఫీట్లని ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాడని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తున్నా తాము మంజూరు చేసిన నిధులే తప్పా ఏ ఒక్క రూపాయి కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకురాలేదన్నారు. తన కాంట్రాక్టర్ల కోసం పూటకో మాట.. రోజుకో వేషం కడుతూ వివిధ పార్టీలు మారుస్తూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం వాసి కాకుండా ఎక్కడి నుండో వచ్చి మునుగోడు అభివృద్ధి కాకుండా వినాశనం చేస్తున్నాడని ఆరోపించారు. రాజగోపాల్రెడ్డి గెలిచిన నాటినుండి మునుగోడు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని, చండూరు మండలం కేంద్రంలో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. రాజగోపాల్రెడ్డి పెద్ద అబద్దాలకోరు అని, అబద్దాలు చెప్పడంలో ఎవరికైనా పద్మశ్రీ ఇవ్వాలంటే అది గోల్మాల్ గోపాలంకే మొదటగా ఇవ్వాలని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తాము ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేశామన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తాము ఇలాంటి దగాకోరు, దౌల్బాజీకి భయపడింది లేదన్నారు. పేద ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎంతటి త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు మీ అరాచకాలను, ఆకృత్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చండూరు మండల, పట్టణాధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కొత్త పార్టీ సతీశ్, చండూరు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, చండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, బొడ్డు సతీశ్, పెద్దగోని వెంకన్న, కూరుపాటి సుదర్శన్, తేలుకుంట్ల చంద్రశేఖర్, జానయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Chandur : ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పతనానికి ఇదే నాంది : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి