సమైక్య పాలనలో భూ రికార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. భూమి అనుభవదారు ఒకరుంటే, రికార్డుల్లో పట్టాదారు మరొకరు, కబ్జాదారు ఇంకొకరు ఉండేవారు. వీఆర్ఓ మారిండంటే కబ్జా కాలంలో పేర్ల మార్పులు, పాస్ పుస్తకాల్లో భూమి హెచ్చుతగ్గులు ఉండేవి. ఫలితంగా నిత్యం పోలీస్స్టేషన్లలో కేసులు, కోర్టుల్లో దావాలు వేసే పరిస్థితి. అలాంటి పరిస్థితిని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తాసీల్దార్కు రెవెన్యూ అధికారాలు అప్పగించి పది నిమిషాల్లోనే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది.
ఈ పోర్టల్తో నేడు భూ సమస్యలన్నీ పరిష్కారమవడమే కాకుండా లెక్కలన్నీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. అలాంటి ధరణిని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పాత పద్ధతులతో భూ పంచాయతీలు పెరుగుతాయని, దళారీ వ్యవస్థ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణి కొనసాగేందుకు సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని తేల్చి చెబుతున్నారు.
ధరణితో వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తిప్పలు తప్పినయ్. గతంలో మండలాఫీస్ చుట్టూ అనేక సార్లు తిరిగినా పైసలు ఇవ్వకపోతే పట్వారీలు పనిచేయకపోయేది. గతంలో సాక్షులను తీసుకొని దేవరకొండ ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లాలంటే టైము, డబ్బులు వృథా అయ్యేది. ధరణి వచ్చినంక ఎమ్మార్వో ఆఫీసులోనే పనులవుతున్నయ్.
ఎవ్వరికీ రూపాయి ఇచ్చే పనిలేదు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మరుసటి రోజే రిజిస్ట్రేషన్ అవుతుంది.15 నిమిషాల్లోనే అధికారులు పట్టా పత్రాలు అందిస్తున్నరు. ఆన్లైన్లో సర్వే నంబర్ కొట్టగానే భూమి వివరాలు తెలుస్తున్నయి. సీఎం కేసీఆర్ సారు తెచ్చిన ధరణితో మా ఇబ్బందులు తీరినయ్, కాంగ్రెస్ నాయకులు ధరణి రద్దు చేస్తామంటున్నరు. రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. రైతుల క్షేమం కోరే బీఆర్ఎస్కే మా మద్దతు ఉంటుంది.
– వీరమల్ల రాజు గౌడ్, అంతంపేట, మర్రిగూడ మండలం
గతంలో భూ ములకు భరోసా ఉండేది కాదు. భూములు అమ్ముకున్నా, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు పడరాని పాట్లు పడ్డం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పుణ్యమాని మధ్య దళారుల బెడద లేకుండా గంటల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. మ్యుటేషన్ కూడా వెంటనే అయిపోతున్నది. గతంలో మా పొలం మా పేరుతో ఉందా.. ఎవరైనా తీసేసు కున్నారా అని టెన్షన్ పడాల్సి వచ్చేది. ఇప్పుడు నేను వేలిముద్ర వేస్తే తప్ప ఎవరు కూడా వారి పేరుపై మార్చుకునే అవకాశం లేదు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో మా భూములకు భరోసా ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు పటేల్, పట్వారీ వ్యవస్థతో మస్తుగ ఇబ్బందులు పడ్డం. అప్పుడు పహాణీ కావాలంటే పట్వారీ సంతకం పెట్టాలె, గిర్దావర్, తాసీల్దార్ సంతకాలు పెడితే అయ్యేది. ఇదంతా జరిగేందుకు రెండు నెలలు పట్టేది. డబ్బుల కోసం వాళ్లు తిప్పించుకునేటోళ్లు. ఇప్పుడు ఆ బాధలు లేవు. కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు పట్టా పుస్తకంలో కౌలు రైతుల పేర్లు ఇస్తే పట్టా రైతులకు కౌలు రైతులకు పంచాయితీ మొదలైతది. రైతులు ప్రశాంతంగా ఉండడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేకనే ఇలాంటివన్నీ చెబుతున్నరు. వారి మాటలు నమ్మ ఓటేస్తే రైతుల పరిస్థితి ఆథోగతే. భూ సమస్యలు లేకుండా ఉండాలంటే ధరణి ఉండాల్సిందే.
– శవ్వ మాదారు, రైతు, చింతకుంట్ల, కొండమల్లేపల్లి
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో మా భూములు భద్రంగా ఉంటున్నయ్. గతంలో భూములకు సంభందించిన వివరాలు తెలుసుకోవాలంటే రోజుల పాటు అధికారుల చుట్టూ తిరిగేవాళ్లం. రికార్డులన్నీ అధికారుల చేతిలో ఉండటం వల్ల ఎప్పుడు వివరాలు మారుస్తరో, ఎవరికి పట్టా చేస్తారో తెలియక పోయేది. నేడు ఆపరిస్థితి లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు యాప్ ఓపెన్ చేసి మా భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ధరణితో వచ్చింది.
అలాంటి ధరణి ఎత్తేస్తామని, పటేల్, పట్వారీ కాలం తీసుకొస్తామని చెప్పడం చూస్తుంటే రైతులను ఇబ్బంది పెట్టాలని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది. ధరణిలో వివరాలు సక్రమంగా ఉంటడం వల్లే రైతుబంధు డబ్బులు నేరుగా మా ఖాతాలో పడుతున్నాయ్. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ గంటలోపే పూర్తి అవుతున్నయ్. ధరణి తీసేస్తే రైతులకు మళ్లీ దరిద్రం చుట్టుకుంటుంది. కాంగ్రేసోళ్ల మాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరు.
– మారెళ్ల రాంరెడ్డి, రైతు, వాడపల్లి, దామరచర్ల మండలం
భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో ఉంచడం వల్ల పనులు సులువుగా అవుతున్నయ్. ధరణి ఫోర్టల్ను ఎత్తేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నరు. అలా చేస్తే మళ్లీ రైతుల మధ్య లొల్లి తప్పదు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకునేటోళ్లు. ఏ పనికైనా లంచం ఇవ్వాల్సి వచ్చేది. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ధరణి ఫోర్టల్ పెట్టి ప్రతి రైతుకు పట్టాదారు పాస్పుస్తకాలు అందించారు. వెబ్సైట్లో సర్వే నంబర్ కొడితే చాలు ఎవరి పేరు మీద ఎంత భూమి ఉన్నది తెలిసిపోద్ది. అందుకే మేమంతా ధరణి కావాలని, మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నం.
-పడాల సత్తయ్య, మంగమ్మగూడెం, శాలిగౌరారం.
కాంగ్రెస్ వాళ్లు చెబుతున్న కౌలుదారు చట్టంతో రైతులకు కష్టాలు తప్పవు. ఇప్పటి వరకైతే భూమి ఉన్న రైతులు తాము సాగు చేసేకోలేక పోయిన భూములను ఇతరులకు కౌలుకు ఇస్తున్నారు. కానీ కౌలుదారు చట్టం తెస్తే పట్టా ఉన్న రైతుతో పాటు కౌలు రైతు పేరు కూడా రికార్డుల్లో పెడుతరు. కైలు రైతుకు బప్పందం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బప్పందాన్ని అడ్డం పెట్టుకొని కొంత మంది భూమికి అడ్డు తగిలే ప్రమాదం ఉంటుంది. కౌలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతరు.
దాంతో ఇద్దరి మధ్య గొడవలు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణితో భూ యజమానులు సర్వ హక్కులు కలిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమిని కౌలుకు ఇచ్చుకుంటున్నరు. కౌలుదారు చట్టంతో రైతులెవరూ భూములు కౌలుకు ఇవ్వకపోవడంతో చిన్న రైతులు బజారున పడే పరిస్థితి నెలకొంటది. రైతులను ఇబ్బందులు పెట్టే చట్టాలు తీసుకొస్తామని చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి రానియ్యకుండా రైతులందరూ కలిసి కట్టుగా పని చేయాలి.
– శెట్టి ఈశ్వరయ్య ,చిన్నమాదారం, కనగల్ మండలం