నల్లగొండ, డిసెంబర్-1: తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్గా పోటీచేసేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ అనే బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించారని, ఈ సంఘటకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు బాధితులైన యాదగిరి-నాగలక్ష్మి దంపతులతో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ బిడ్డలను కిడ్నాప్ చేయటాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్య హక్కులో భాగంగా ఎన్నికల్లో పాల్గొనే పోటీ చేసే హక్కు కూడా బీసీలకు లేదా అని ప్రశ్నించారు.
యాదగిరిని కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం పోసి తాగించటం అంటే బీసీలు రాష్ట్రంలో బతకడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వెంటనే ఈ ఘటనపై స్పందించి బాధ్యులను 24 గంటల్లో అరెస్టు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు బీసీలపై దాడులు చేస్తే తాము ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రి కోమటిరెడ్డి బాధ్యత వహించాలి..
యాదగిరిని కిడ్నాప్ చేసిన బాధ్యులపై వెంటనే అరెస్టు చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్లమ్మ గూడెం మాజీ సర్పంచ్ విజయ్ రెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న సందీప్ రెడ్డితో పాటు ఏ-2గా ఉన్న ప్రవీణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాశం రాంరెడ్డే..యాదగిరిని కిడ్నాప్ చేశారన్నారు. యాదగిరిని కిడ్నాప్ చేసి, వాహనంలో హైదరాబాద్కు తీసుకెళ్లి మద్యంలో మూత్రం పోసి తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని…ఎన్నికల అధికారిగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఆ నలుగురిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు.
కుక్కను ఈడ్చినట్లు ఈడ్చుకెళ్లారు..
నామినేషన్ వేసేందుకు అద్దెకు కారు మాట్లాడేందుకు నకిరేకల్లోని ఇంటి నుంచి బయటకు వెళ్లగానే కొందరు వ్యక్తులు తనను కుక్కను ఈడ్చినట్లు ఈడ్చుకెళ్లి కారులో పడేసి, హైదరాబాద్ తీసుకెళ్లినట్లు బాధితుడు యాదగిరి తెలిపారు. రోజంతా కారులో తిప్పి, హైదరాబాద్లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నామినేషన్ వేయవద్దని బలవంతం చేశారన్నారు. వినకపోవటంతో మద్యంలో మూత్రం పోసి తాగించడంతో పాటు పిడి గుద్దులు గుద్దారని, తన దుస్తులు మొత్తం విప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని యాదగిరి-నాగలక్ష్మి దంపతులు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బీసీ, బీఆర్ఎస్ నేతలు మందడి సైదిరెడ్డి, రిటైర్ట్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, జమాల్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.