సూర్యాపేట రూరల్, జూన్ 9 : తెలంగాణ రాష్ట్రం మాంసం దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో శుక్రవారం రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జంట నగరాల్లో నల్లగొండ పొట్టేలు మాంసానికి భారీ డిమాండ్ ఉన్నదన్నారు. మాంసానికి డిమాండ్ ఉండడంతో గొర్రెలను పెంచితే గొర్ల కాపరులు ఆర్థికంగా ఎదుగుతారన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంటే.. ప్రతిపక్ష నాయకులు గొర్లు, బర్లు అంటూ వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. కుల వృత్తులు చేసుకుంటామని ముందుకొచ్చే వారికి చేయూతనివ్వడం ప్రభుత్వ ధర్మమన్నారు. వారు అధికారంలో ఉండగా ఆ ధర్మాన్ని విస్మరించి ఆధర్మంగా పాలించినందుకే తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు సంభవించాయని ఆరోపించారు.
సంక్షోభం నుంచి తెలంగాణను గట్టెక్కించడంతోపాటు సుభిక్షంగా మార్చిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. అధికారంలో ఉండగా ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని నేతలు.. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. అర్థం తెలియని వారే అడ్డదిడ్డంగా మాట్లాడి కుల వృత్తులను కించ పరుస్తున్నారని అన్నారు. గొర్రెల పెంపకం మున్ముందు రాష్ర్టానికి పెద్ద పెట్టుబడిగా మారనున్నదని, గొర్రెల పెంపకానికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అందులో మొదటిది తోళ్ల పరిశ్రమ అయితే.. మరొకటి మాంసాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారులందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని మంత్రి జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్రావు, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, సర్పంచ్ పిండిగ పద్మ, ఎంపీటీసీ చింత అలివేలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.