యాదగిరిగుట్ట, జూలై11: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన ట్రస్టు బోర్డు కొలువు దీరింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమక్షంలో స్వామివారి గర్భాలయ ప్రాంతంలో ఉదయం 11.37 గంటలకు ఈవో భవానీ శంకర్ ట్రస్టు బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో తొలుత ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ట్రస్టు బోర్డు సభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకట స్వామి, కొణిదెల సురేఖ, చిల్లప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య గుప్తా, స్వాతి కంఠమణి, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఎక్స్ అఫీషియో సభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ డైరక్టర్ ఎం. హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, దేవస్థాన ఈవో భవానీ శంకర్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు బాధ్యతలు చేపట్టిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు బోర్డు చైర్మన్, సభ్యులు నారసింహుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంతోపాటు వేదాశీర్వాచన మండపంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ట్రస్టు చైర్మన్ సత్యనారాయణరెడ్డి, బోర్డు సభ్యులకు ఆలయ ప్రధానార్చక బృందం చతుర్వేద మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భవానీ శంకర్ మంత్రి, ప్రభుత్వ విప్, బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులకు స్వామివారి చిత్రపటంతో పాటు మహాప్రసాదాన్ని అందేజేశారు. అనంతరం పశ్చిమ రాజగోపురం ఎదుట మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి ఫొటోలు దిగారు.
అనువంశిక ధర్మకర్త గైర్హాజర్..
ట్రస్టు బోర్డు సభ్యుడిగా ఎన్నికైన దేవాలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి గైర్హాజరయ్యారు. ఆలయ నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగా తనకు ఇవ్వాల్సిన చైర్మన్ పదవిని ఇతరులకు కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటైన పాలక మండలిలో ఆయనను అనువంశిక ధర్మకర్తగా చైర్మన్గా నియమించారు. కానీ అందుకు భిన్నంగా ఈసారి పాలక మండలిలో దేవస్థానానికి సంబంధం లేని మరో వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తనకు సముచిత స్థానం, గౌరవం దక్కిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనువంశిక ధర్మకర్తకు గుర్తింపు లేకుండా చేస్తోందని మండిపడ్డారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి అనువంశిక ధర్మకర్తను తొలగించే ప్రయత్నాన్ని ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని నరసింహమూర్తి పేర్కొన్నారు. ట్రస్టు బోర్డును సవాల్ చేస్తూ హిందూ ధర్మపరిరక్షణ సమితి, రాష్ట్ర ధర్మకర్త మండలి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అనువంశిక ధర్మకర్త వ్యవస్థను తొలగించేందుకు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. ఇందులో భాగంగానే ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మరో ట్రస్టు బోర్డు సభ్యుడైన తూళ్ల వీరేందర్గౌడ్, ఎక్స్ అఫీషియో సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు.