నందికొండ, మార్చి 3 : కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు చెంతనే ఉన్న నందికొండ మున్సిపాలిటీలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటిని సరఫరా చేసే ఫిల్టర్ హౌస్లో మోటర్లు చెడిపోవడంతో కాలనీలకు నీళ్లు రావడం లేదు. పైలాన్ కాలనీలో మూడు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. దాంతో బిందెలు, డ్రమ్ము ల్లో నీటిని పట్టుకొనే దుస్థితి ఏర్పడింది. దాంతో గత ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్కాలనీలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ హౌస్ ద్వారా హిల్కాలనీ, పైలాన్ కాలనీలకు నీటి సరఫరా అవుతుంది. తరుచూ ఫిల్టర్ హౌస్లో మోటర్లు, పంపులు పాడైపోవడంతో రెండు, మూడు రోజుల కొకసారి నీటి సరఫరా నిలిచిపోతున్నది.
తాజాగా పైలాన్కాలనీకి నీటిని సరఫరా చేసే పంపు పాడైపోగా దానిని ఎన్నెస్పీ అధికారులు మరమ్మతులు చేయించినా బాగు కాలేదు. దాని స్థానంలో నూతనంగా రూ.1.60 లక్షలతో పంపును ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎన్నెస్పీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మూడు రోజులుగా నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని కాలనీలకు అందిస్తున్నా అవి సరిపోవడం లేదు. ఇదే అదునుగా మున్సిపల్ ట్యాంకర్ల డ్రైవర్లు రూ.500 ట్యాంకర్ నీటిని అమ్ముకుంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దాంతో ప్రజలకు నీళ్లు అందక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిపై ఫిల్టర్ హౌస్ ఎన్నెస్పీ ఏఈ భిక్షమయ్యను వివరణ కోరగా ఫిల్టర్ హౌస్లో పంపు పాడైపోయిందని, దానిని బాగు చేయిండానికి వీలు కాకపోవడంతో ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపారు. కొత్త పంపు ఏర్పాటుకు ఇంకా మూడు రోజులు పడుతుందని, త్వరగా ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు.