ఓైటైతే నమోదు చేసుకున్నారు కానీ.. ఉప ఎన్నిక కావడంతో పట్టభద్రులు ఓటింగ్పై ఆసక్తి చూపుతారా లేదా అన్న సంశయానికి తెరదించుతూ భారీగా తరలివచ్చారు. సాధారణ ఎన్నికలను తలపిస్తూ పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. సోమవారం జరిగిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఉదయం ఎనిమిది గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్ కొన్ని చోట్ల రాత్రి ఆరు గంటల వరకు కొనసాగింది. పట్టణ ప్రాంతాల్లోని ఎక్కువ పోలింగ్ బూతులు సాయంత్రం వరకు ఓటర్లతో నిండి ఉన్నాయి. సాయంత్రం 4గంటల వరకు 68.65శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతం మంగళవారం వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా 2021 ఎన్నికల్లో అంతకుముందు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 76.41 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ చోట్ల బీఆర్ఎస్ ట్రెండ్ స్పష్టంగా వెల్లడైంది. గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా అన్నిచోట్లా మంచి స్పందన కనిపించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు ముందే కాడి పారేసిన చందంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
– నల్లగొండ ప్రతినిధి, మే 27 (నమస్తే తెలంగాణ)
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది. తొలి రెండు గంటల్లో కొంత మందకొడిగా అనిపించినా తర్వాత ఓటర్లు బారులు తీరారు. కానీ మధ్యాహ్నం సమయంలో భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలు ఓ వైపు పురుషులు, మరోవైపు మహిళల లైన్లతో కిక్కిరిసి కనిపించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ను ముగించాల్సి ఉంది. కానీ ఆ సమయానికి 80శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ఓటరు గంటకు పైగా లైన్లో వేచి చూసి ఓటు వేశారు. కొన్ని చోట్ల సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లు సాయంత్రం ఆరు గంటల వరకు ఓపికగా లైన్లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. వీరందరికీ టోకెన్లు ఇచ్చి పోలింగ్ను చివరి ఓటర్ వరకు కొనసాగించారు.
సోమవారం జరిగిన పోలింగ్లో తొలి రెండు గంటల్లో పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. తర్వాత ఊపందుకుంది. చివరి రెండు గంటల్లోనే భారీగా ఓటర్లు తరలిరావడంతో సందడి కనిపించింది. ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలు కాగా 10 గంటల వరకు నియోజకవర్గవ్యాప్తంగా 11.34 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వారీగా పరిశీలిస్తే నల్లగొండలో 9.95శాతం, సూర్యాపేట 11.32 శాతం, యాదాద్రి జిల్లాలో 11.26 శాతం నమోదైంది. ఈ పోలింగ్ విధానాన్ని చూస్తే అంతగా పోలింగ్ నమోదు అవుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఓటర్లు పోలింగ్ బూతులకు క్యూ కట్టారు. తర్వాత మధ్యాహ్న 12గంటల వరకు పరిశీలిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా 29.30 శాతం నమోదైంది.
నల్లగొండ జిల్లాలో 26.94శాతం, సూర్యాపేట 31.27శాతం, యాదాద్రి జిల్లాలో 27.71 శాతం పోలింగ్ నమోదైంది. తొలి అర్ధ సమయం నాలుగు గంటల్లో కేవలం 30 శాతానికి అటుఇటుగా పోలింగ్ కావడంతో చివరి నాలుగు గంటల్లో మరో 30శాతం అవుతుందేమోనని అంచనా వేశారు. కానీ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దాంతో రెండు గంటల్లోనే 20.23శాతం పోలింగ్ నమోదైంది. నియోజక వర్గ వ్యాప్తంగా చూస్తే 49.53 శాతం నమోదైంది. అంటే నల్లగొండ జిల్లాలో 47.44 శాతం, సూర్యాపేటలో 52.80 శాతం, యాదాద్రిలో 47.92శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఆ తర్వాత మిగిలింది చివరి రెండు గంటల సమయమే. ఆ సమయంలోనే మిగిలిన 50శాతం ఓటర్లలో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు తరలి
వచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పూర్తి ప్రశాంతంగానే కొనసాగింది. ఉదయం నుంచి రాత్రి పోలింగ్ ముగిసే వరకు భారీ పోలీసు బందోబస్తు కూడా కొనసాగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, తన ఆర్వో కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలింగ్ స్టేషన్ల వారీగా బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల బయట కూడా ఆయా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించినా ఎవరికీ వారే ప్రశాంతంగా ఉన్నారు. పోలింగ్కు వచ్చే ఓటర్లను మరోసారి ఓట్లను అభ్యర్థిస్తూ కనిపించారు. ఇక నార్కట్పల్లిలో కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్గౌడ్ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అశోక్గౌడ్కు వాగ్వివాదం జరుగడంతో దాడికి యత్నించారు. దాంతో అశోక్ పోలిస్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఇది మినహా అన్ని చోట్లా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. ప్రత్యేక మొబైల్ టీమ్లు నిరంతరం ఆయా రూట్లలో బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ పూర్తి ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్ఓ హరిచందనతోపాటు ఎస్పీ చందనాదీప్తి ప్రకటించారు. ప్రశాంత పోలింగ్కు సహకరించిన అభ్యర్థులు, ఓటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఓటరు ఓటు వేసేందుకు కనీసం రెండు నిమిషాల నుంచి కొందరైతే ఐదారు నిమిషాలు కూడా సమయం తీసుకున్నారు. ఈ సారి కూడా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బ్యాలెట్ పేపర్ల సైజ్ పెద్దగా ఉంది. ఓటరు సంతకం చేశాక బ్యాలెట్ పేపర్ను జాగ్రత్తగా చించాల్సి వచ్చింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా… పేపర్ చిరిగే ప్రమాదం ఉంది. దీంతో పాటు బ్యాలెట్ పేపర్ను నిలువుగా మూడు మడతలుగా చేశాక అడ్డంగా మరో మూడు మడతలుగా చేసి ఓటర్కు అందజేశారు. దీనికి కొంత అదనపు సమయం తీసుకుంది. ఓటరు దీన్ని విప్పి తిరిగి తాను అనుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేందుకు వారిని వెతుక్కోవడానికి కూడా మరికొంత సమయం పట్టింది. చివరగా ఓటు వేశాక మళ్లీ తిరిగి సేమ్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్ను మడత చేసి పోలింగ్ బాక్స్లో వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కనీసం రెండు నుంచి ఐదు నిమిషాల సమయం తీసుకుంది. దాంతో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు అదనపు సమయం వేచి చూడక తప్పలేదు. ఇది కూడా సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగడానికి కొంత కారణంగా కనిపించింది.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఒక్కసారిగా పెరిగింది. ఓ వైపు ఎండ ప్రభావం, ఉక్కపోత తీవ్రంగా ఉన్నా ఓటర్లు లెక్కచేయకుండా ఓటింగ్కు తరలివచ్చారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపించింది. రెండు గంటల నుంచి ఓటింగ్ కోసం వచ్చిన ఓటర్లు కనీసం గంటకు పైగా వేచి ఉండి ఓటు వేసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన వారు చాలా సమయం క్యూలైన్లలో వేచి ఉండి ఓపికగా ఓటింగ్లో పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 68.65శాతం పోలింగ్ నమోదు కాగా నల్లగొండ జిల్లాలో 66.75శాతం, సూర్యాపేటలో 73.15 శాతం, యాదాద్రిలో 78.59శాతం అయ్యింది. ఆ తర్వాత కూడా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారు. మొత్తంగా చివరి రెండు గంటల్లోనే ఎక్కువ పోలింగ్ జరిగినట్లు తెలుస్తున్నది. కాగా 2021 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో 76.41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2015లో ఉమ్మడి జిల్లాగా ఉన్న నల్లగొండలో మొత్తం 58.97శాతం ఓట్లు పోలయ్యాయి.
నల్లగొండ పట్టణ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి పరిధి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోనే కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 5వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల నుంచి పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులన్నీ నల్లగొండకే తరలిస్తున్నారు. వేర్ హౌసింగ్ గోదాముల్లో ఇందుకోసం ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సెలన్నింటినీ ఇందులోనే భద్రపరుస్తున్నారు. ఇందుకోసం ముందే గుర్తించిన రూట్లలోనే ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్తో బాక్స్లను బస్సుల్లో తరలిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం, వరంగల్రూరల్, అర్బన్, ఖమ్మం జిల్లాల బాక్స్లు అర్ధరాత్రి వరకే ఇక్కడికి చేరుకున్నాయి. ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్భూపాలపల్లి జిల్లాల నుంచి మాత్రం అర్ధరాత్రి దాటిన తర్వాత రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడికి వస్తున్న బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచే విధానాన్ని స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలోనే వీటికి సీల్ వేస్తున్నట్లు ఆర్ఓ వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.