శాలిగౌరారం, జూలై 15: సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపు రేఖలు మారిపోయాయి. గతంలో శాలిగౌరారం గ్రామ పంచాయతీ పరిధిలో ఆవాస గ్రామంగా ఉన్న రామగిరి ఉండేది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి.
చేపట్టిన అభివృద్ధి పనులివే..
205 గృహాలు, 670 మంది జనాభా ఉన్న రామగిరిలో 700 ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతంఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో రూ.15 లక్షల సీసీ రోడ్లు, రూ.15 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణం, రూ.12.60 లక్షలతో , ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ చేశారు. రూ.2.40లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.3 లక్షలతో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20లక్షలు మంజూరై సిద్ధ్దంగా ఉన్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దాంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2014 వరకు ఒక్క సీసీ రోడ్డు లేదు
2014 వరకు రామగిరిలో ఒక్క సీసీ రోడ్డు కూడా లేదు. అభివృద్ధ్దికి నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే పల్లె ప్రగతితో గ్రామంలో అభివృద్ధ్ది పనులు వేగంగా పూర్తయ్యాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు దశలవారీగా నిర్మించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు తెలియపర్చడంతో వెంటనే స్పందించి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-బండారు శంకరయ్య, సర్పంచ్, రామగిరి.