ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్జాం తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి పంటలు కోత దశలో ఉండగా, కొన్ని చోట్ల కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు ఉన్నాయి.
కూలీల కొరతతో పత్తి మొక్కలపైనే ఉండగా.. మిరప కాత దశలో ఉన్నది. ఈ నేపథ్యంలో తుఫాన్తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పంటలు చేతికొస్తున్న తరుణంలో ముంచుకొస్తున్న తుఫాన్తో రైతులు అప్రమత్తంగా ఉండాలి. వర్షం తగ్గిన తర్వాత మొక్కలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. అవసరమైతే పంటల వద్దకు తీసుకెళ్లి వారి సలహాలు, సూచనల మేరకు మోతాదు ప్రకారం మందులు పిచికారీ చేయాలి.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి