ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. ఆంధ్రా అధికారులు సుమారు 1,000 మంది పోలీస్ బలగాలతో డ్యామ్ గేట్లను బద్ధలు కొట్టి, డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి 13వ గేట్ అవతల ఉన్న కంట్రోల్ రూమ్కు తెలంగాణ అధికారులు, పోలీసులను వెళ్లకుండా చేశారు. దౌర్జన్యంగా కుడికాల్వ గేట్లను తెరిచి నీటిని విడుదల చేసుకుంటున్నారు.
డ్యామ్ పైన ఆంధ్రా అధికారులు, పోలీస్ బలగాలను తిప్పి పంపడానికి 1,500 మంది పోలీసు బలగాలను తెలంగాణ ప్రభుత్వం మోహరించింది. కేంద్ర బలగాలు కూడా శుక్రవాం రాత్రి డ్యామ్ వద్దకు చేరాయి. మరోవైపు సమస్య పరిష్కారానికి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ఆంధ్రా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కుడి కాల్వ ద్వారా నీటి విడుదల ఆపాలని ఆంధ్రా ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను జారీ చేసినా పట్టించుకోలేదు. ఇక డ్యామ్ పైన ఉద్రిక్త వాతావరణం నెలకొల్పిన ఆంధ్రా అధికారులు, పోలీసులపై తెలంగాణ డ్యామ్ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో నందికొండ పైలాన్కాలనీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
నందికొండ, డిసెంబర్ 1 : నాగార్జున సాగర్ డ్యామ్పై గురువారం రాత్రి ప్రారంభమైన ఉద్రిక్తత పరిస్థితులు శుక్రవారం కూడా కొనసాగాయి. ఆంధ్రా అధికారులు సుమారు వెయ్యి మంది పోలీస్ బలగాలతో గురువారం తెల్లవారుజామున డ్యామ్ గేట్లను పాడుచేశారు. డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డ్యామ్పైకి ప్రవేశించారు. డ్యామ్ 13వ గేట్ వరకు తమదని అక్కడ ముళ్ల కంచె, బారికేడ్లు ఏర్పాటు చేసి డ్యామ్ పైన రోడ్డును మూసివేశారు.
అవతల ఆంధ్రా పోలీసులు పహారా కాస్తూ డ్యామ్ పైన 13వ గేట్ అవతల ఉన్న కంట్రోల్ రూమ్కు తెలంగాణ అధికారులను, పోలీస్ వాళ్లను పోకుండా నిలిపివేశారు. డ్యామ్ సగ భాగం తమదని కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకుంటామని, గురువారం బలవంతంగా కుడి కాల్వ గేట్లను తెరిచి 5వేల క్యూసెక్కులతో నీటి విడుదల చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాటిని తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీస్ బలగాలను తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ వద్ద మోహరించింది. సమస్యను పరిష్కరించడానికి ఇరిగేషన్ అధికారులు ఆంధ్ర అధికారులతో చర్చలు నిర్వహిస్తున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్పైకి అక్రమంగా ప్రవేశించి, కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు శుక్రవారం చర్చలు జరిపారు. నాగార్జునసాగర్ డ్యామ్ వద్దకు శుక్రవారం ఉదయం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ హరిరామ్, సీఈలు హమీద్ఖాన్, ధర్మానాయక్, రమేశ్బాబు చేరుకొని డ్యామ్ పైన పరిస్థితులను పరిశీలించి ఆంధ్రా అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమంయంలో శ్రీశైలం డ్యామ్ నిర్వాహణను ఆంధ్రా ప్రభుత్వం, నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వాహణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు సూచనల ప్రకారం ఆంధ్రా రాష్ర్టానికి రావలసిన నీటి వాటాను వారికి విదుడల చేస్తున్నామన్నారు.
కృష్ణా బోర్డు సూచించిన ప్రకారం 5 టీఎంసీల నీటికి బదులుగా 5.10 టీఎంసీల నీటిని అక్టోబర్లో విడుదల చేశామని, 2024 జనవరి నెలలో మరో 5 టీఎంసీల నీటిని విడుదల చేయవలసి ఉన్నదని తెలిపారు. నవంబర్లో కుడి కాల్వకు నీటి విడుదలపై ఆంధ్రా అధికారుల నుంచి వినతి లేదని, ఆంధ్రా అధికారులు కావాలనే డ్యామ్పై ఉద్రిక్త వాతావరణం నెలకొల్పి కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారని చెప్పారు. నీటి విడుదల, డ్యామ్పై ఆంధ్రా అధికారుల తీరును కృష్ణా రివర్ బోర్డుకు తెలియపరిచామన్నారు.
కుడి కాల్వ ద్వారా నీటి విడుదలను నిలుపుదల చేయాలని ఆంధ్రా ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అయినా.. ఆంధ్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కుడి కాల్వకు నీటి విడుదలను కొనసాగిస్తున్నది. అయితే.. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పరిస్థితులను చక్కబెట్టడానికి, ఆంధ్రా అధికారులు, పోలీసులను తిప్పిపంపడానికి కేంద్ర పోలీస్ బలగాలు చేరుకుంటున్నాయి. సుమారు 300 మంది కేంద్ర బలగాలు రానున్నట్లు సమాచారం.
నాగార్జునసాగర్ డ్యామ్పై ఉద్రిక్త వాతావరణం నెలకొల్పి డ్యామ్ పోలీస్ సిబ్బందిపై దాడి చేసి, సీసీ కెమెరాలు, ఫోన్లను ధ్వంసం చేసిన ఆంధ్రా అధికారులు, పోలీసులపై తెలంగాణలోని నందికొండ పైలాన్కాలనీలోని పోలీస్ స్టేషన్లో తెలంగాణ డ్యామ్ ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టారు.
ఆంధ్ర అధికారులు, పోలీస్ బలగాలు నాగార్జునసాగర్ డ్యామ్పైన ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పడంతో పరిస్థితులను చక్కదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక, సివిల్, ఏఆర్, బెటాలియన్లతో పోలీస్ బలగాలను తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ వద్ద మోహరించింది. వెయ్యి మంది పోలీసులు తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ వద్ద పహారా కాస్తున్నారు.