యాదగిరిగుట్ట, మే13 : స్వయంభూ నారసింహుడి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు శనివారం సందడిగా మారాయి. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలోని కల్యాణ మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హవనం చేశారు. భూత పేత పిశాచాల బాధలు తొలగి, ఇలలోక సుఖాలు, పరలోక మోక్షాలు సిద్ధించే హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు.
కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చనలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామి, అమ్మవార్ల జోడు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ముఖ మండపంలో దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి వేళలో స్వామివారి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని సుమారు 33 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.39,93,873 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి సేవలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని తరించారు. శనివారం స్వామివారి ఆలయానికి చేరుకున్న ఆయన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.