రోహిణి కార్తె ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరంలో శనివారం 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం 38 డిగ్రీలకు చేరడం గమనార్హం. మునగాల మండలంలోనూ 44.3, మఠంపల్లి, చివ్వెంల మండలాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నల్లగొండ జిల్లా దామరచర్లలో ఇప్పటికే 45.6 డిగ్రీలు దాటగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 42 డిగ్రీలకుపైగా ఉంటున్నది. పెరిగిన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-సూర్యాపేట, మే 27
సూర్యాపేట, మే 27 : రోహిని కార్తేలో రోకల్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. శనివారం ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రత ఆల్టైం రికార్డ్ నమోదైంది. హుజూర్నగర్ మండలం లక్కవరం రోడ్డులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదు కావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 25 నుంచి రొహిణి కార్తె ప్రారంభం కావడంతో కార్తె ముగిసే వరకు ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుండడంతో రాత్రి సమయాల్లోనూ వేడికి ప్రజలు తాళలేకపోతున్నారు. అత్యధికంగా హూజూర్నగర్ మండలం లక్కవరం వద్ద 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మునగాల మండలంలో 44.3, మఠంపల్లి, చివ్వెంల మండలాల్లో 44.1, కోదాడలో 43.7,మేళ్లచెర్వు-43.4, పెన్పహాడ్-43.3, నేరేడుచర్ల, చిలుకూరు, గరిడేపల్లి, అనంతగిరి, నడిగూడెం, మోతెల్లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా మండలాల్లో 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత సైతం లక్కవరం వద్దే 38 డిగ్రీలుగా నమోదైంది.
నల్లగొండలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
నల్లగొండ, మే 27 : జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదు అవుతోంది. ఇటీవల 40 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు గత నాలుగు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 24న 42 డిగ్రీలు, 25న 42.5 డిగ్రీలు, 26న 42 డిగ్రీలు, 27 శనివారం 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.6గా ఉన్నది. ఎండ వేడిమికి, వడ గాలులకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
నిప్పుల కొలిమిలా మఠంపల్లి
మఠంపల్లి, మే 27 : వారం రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో మఠంపల్లి నిప్పుల కొలిమిలా తయారైంది. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభమై క్రమేపి పెరిగి మధ్యాహ్నాం కల్లా 40 డిగ్రీలు దాటుతుంది. గత మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ఈ విధంగా ఉన్నది. 25న 43.8 డిగ్రీలు, 26న 42 డిగ్రీలు, 27 శనివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతం కావడం, భారీ వాహనాల రాకపోకలతో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుంది. మఠంపల్లి మండలంలో సాగు భూముల కన్నా బీడు భూములు, ఫారెస్ట్ భూములు అధికంగా ఉండడం కూడా ఎండల తీవ్రతకు మరో కారణం.