సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 17 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం తొమ్మిదేండ్లలోనే యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లోనూ అందరి సమన్వయంతో మరింత బలం పెంచుకుని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో పెన్పహాడ్ మండలం, జీవీవీ ఫంక్షన్ హాల్లో ఆత్మకూర్(ఎస్) మండలానికి బీఆర్ఎస్, బూత్ లెవల్ ఇన్చార్జులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ శిబిరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు తెలంగాణలో నీటి కష్టాలు, ఆకలి చావులు చూశామని, ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలో తెలంగాణ మినహా దేశం పరిస్థితి అలాగే ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వాటన్నింటిని అధిగమించి రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అంతేగాక ప్రస్తుతం రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ ప్రజలందరికీ పంచుతున్నామన్నారు.
మన నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు సుఖశాంతులతో కలిసి మెలసి జీవిస్తున్నారన్నారు. నాడు నిరంతరం గొడవలు, కొట్లాటలతో కేసుల పాలై స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న సమయాన్ని నాయకులకు ఊడిగం చేయడానికే సరిపోయేదన్నారు. నీరు, కరెంట్ సరిగా లేక పంటలు పండక ఎన్నో కుటుంబాలు వలసవెళ్లిన ఘటనలు మరిచిపోగలమా అని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిని సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా రూపుమాపుకొని కరువు నేలలను ప్రస్తుతం సస్యశ్యామలం చేసుకున్నామని తెలిపారు.
నిరంతర విద్యుత్, పుష్కలంగా సాగు, తాగు నీటితో పంటలు సమృద్ధిగా పండిస్తూ వలసలు వాపసు రావడమే గాక ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలసలు వచ్చే స్థాయి ఎదిగామనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. ఇవన్నీ జరిగిన, జరుగుతున్న నిజాలు కాదా అని.. ఇవన్నీ ప్రజలకు తెలిసినప్పటికీ మరోమారు గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఇంత అభివృద్ధి జరిగినా కండ్లున్న కబోధులుగా విపక్షాలు అర్థం లేని ఆరోపణలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
శిక్షణ కార్యక్రమాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రాజకీయవేత్త ఒంటెద్దు నర్సింహారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, పార్టీ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, దొంగరి యుగేంధర్రావు, నాయకులు మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, అంజయ్య, వెన్న సీతరాంరెడ్డి, జానకిరాంరెడ్డి, చెన్ను శ్రీనివాస్రెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, బెల్లంకొండ యాదగిరి, బొల్లె జానయ్య, బత్తుల ప్రసాద్, గుమ్షావలీ పాల్గొన్నారు.