చిట్యాల, ఆగస్టు 28 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ చేసి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఉరుమడ్లలో రూ.20లక్షలతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనం, వెంబాయిలో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులు, రూ.3లక్షలతో నిర్మించనున్న బస్ షెల్టర్, ఎలికట్టెలో రూ.15లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం, నేరడ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇటీవల రాజస్థాన్లో జరిగిన స్పీకర్లు, చైర్మన్ల సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించానని, అందుకు మిగతా రాష్ర్టాల వారు అశ్చర్యానికి గురయ్యారని చెప్పారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అధిక నిధులు కేటాయించి గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కొనసాగాలంటే మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్టు చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఎంపీపీ కొలను సునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.