పని చేయడానికి సహకరించని అంగవైకల్యం, సమాజంలో చిన్న చూపు, ఏది కావాలన్నా ఇతరులపై ఆధారపడడం.. ఇటువంటి అసహాయులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. మానవీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారు. 2014కు ముందు రూ.500 ఉన్న పింఛన్ తొమ్మిదేండ్లలో ఎనిమిదింతలు పెరిగింది. ఈ నెల నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి సంతోషం పంచుకున్నారు. నకిరేకల్లో దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అల్పాహారం చేశారు. నల్లగొండ జిల్లాలో 31,764 మంది దివ్యాంగులు ఉండగా పింఛన్ రూ.వెయ్యి పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.3.17 కోట్ల అదనపు భారం పడనున్నది.
మొత్తంగా సర్కారు నెలకు రూ.12.75 కోట్లు ఖర్చు చేయనున్నది.
-నల్లగొండ, జూలై 23
దివ్యాంగుల ఆసరా పింఛన్ను రూ.4016కు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెల రోజుల్లోనే కార్యరూపం దాల్చింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత నెల 9న దివ్యాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చి ఈ నెల నుంచే దాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దాంతో జూలై నెల నుంచే దివ్యాంగులకు 4,016 రూపాయల పెన్షన్ ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నిధులు విడుదల చేయడంతో పెరిగిన పింఛన్ ఇచ్చే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 31,764 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో వారికి నెలనెలా పింఛన్ రూ.500 ఉండగా, స్వరాష్ట్రంలో పలుమార్లు పెంచుతూ 9ఏండ్లలో రూ.4016 చేశారు. సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం పలుచోట్ల సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
– నల్లగొండ, జూలై 23
దివ్యాంగులకు పెంచిన ఆసరా పింఛన్ ఈ నెల నుంచే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించగా.. అధికార యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. గత నెల 9న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సబ్బండ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీలకు లక్ష రూపాయల రుణం, గొల్ల కుర్మలకు రెండో విడుత గొర్రెల పంపిణీ, దివ్యాంగులకు రూ.వెయ్యి పింఛన్ పెంపు వంటి పథకాలను సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే బీసీలకు రూ.లక్ష రుణంతోపాటు గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ షురూ అయ్యింది. దివ్యాంగులకు రూ.4016 పింఛన్ను ఈ నెల నుంచే ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శనివారం జీఓ విడుదల చేశారు. దీంతో ఈ నెల నుంచే దివాయంగులకు పెంచిన పింఛన్ అందనుంది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి రాష్ట్రంలో దివ్యాంగులకు ఆసరా పథకం కింద నెలకు రూ.500 పింఛన్ అందేది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1500కు పెంచింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక రూ.3016 చేశారు. ప్రస్తుతం మరో వెయ్యి పెంచి రూ.4016 చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి అమలు చేస్తూ జీఓ జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో పింఛన్ తీసుకునే దివ్యాంగులు 31,764 మంది ఉండగా, వారికి ప్రతి నెలా రూ.3016 చొప్పున రూ.9,58,00,224 చెల్లిస్తున్నది. ప్రస్తుతం వెయ్యి రూపాయలు పెంచడంతో ఇక నుంచి ప్రతి నెలా రూ.12,75,64,224 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలనెలా 3,17,64,000 రూపాయల అదనపు భారం పడనుంది.
నకిరేకల్, జూలై 23 : దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముచ్చటగా మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.4016కు పెంచుతూ జీఓ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి దివ్యాంగులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో సమానంగా ఎదుగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే దివ్యాంగుల పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచిందని తెలిపారు. పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్కు దివ్యాంగుల తరఫున పాదాభివందనాలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, కట్టంగూర్, నార్కట్పల్లి ఎంపీపీలు జెల్ల ముత్తిలింగం, సూదిరెడ్డి నరేందర్రెడ్డి, నకిరేకల్, కట్టంగూర్ జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, ఏడుకొండలు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, బీఆర్టీయూ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, దైద పరమేశ్, గుర్రం గణేశ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, దివ్యాంగులు పాల్గొన్నారు.
వికలాంగుల ఆసరా పింఛన్ను రూ.4,016కు పెంచి మాలో మనోధైర్యాన్ని నింపిన మహనీయుడు సీఎం కేసీఆర్. మానవీయతకు నిలువెత్తు నిదర్శనం మన ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆది నుంచీ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడం. అవసరమైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలి. మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలె.
– గుండెబోయిన ఉపేందర్ యాదవ్, చర్లగౌరారం, కనగల్ మండలం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్ రూ.500 ఇచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి దఫాలో రూ.1500, రెండో దఫాలో రూ.3016కు పెంచారు. ఇప్పుడు రూ.3016 నుంచి రూ.4016కు పెంచడం చెప్పలేని సంతోషంగా ఉన్నది. నిస్సహాయ స్థితిలో ఉన్న మాకు మరో వెయ్యి రూపాయల పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు. ముచ్చటగా మూడోసారీ సీఎంగా కేసీఆరే రావాలి. ఎమ్మెల్యేగా చిరుమర్తే కావాలి.
– తండు సైదులు, మంగళపల్లి, నకిరేకల్ మండలం
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల ఆసరా పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచడంతో మాలో ఆత్మాభిమానం పెరిగింది. అంగవైకల్యం కారణంగా జీవితాలు భారంగా గడుస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు పింఛన్ పెంచి వికలాంగులను అక్కున చేర్చుకున్నది. వికలాంగుల సమస్యను గుర్తించి వెయ్యి రూపాయలు పెంచి రూ.4016 అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. వికలాంగ కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– గాయం గోవర్ధన్రెడ్డి, మఠంపల్లి
కోదాడ టౌన్, జూలై 23 : ఆసరా పింఛన్ పెంపుపై దివ్యాంగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం కోదాడ పట్టణంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫ్లెక్సీకి దివ్యాంగులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్, పాండు, రమాశ్రీనివాస్, దేవమణి, లలిత, వెంకటరత్నం, మౌలానా, ఉపేందర్, బాబు, రహీం, గోపాల్, రాంబాబు, దివ్యాంగులు పాల్గొన్నారు.
అసహాయుల పట్ల ఔదార్యాన్ని చాటిన సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచడం హర్షణీయం. నేను ఎంఎస్డబ్ల్యూ అభ్యసించాను. నా భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఈ పింఛన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డబ్బుతో కనీస అవసరాలు తీర్చుకుంటూ పరీక్షలకు సన్నద్ధ్దమవుతాను. గత పాలకుల నిర్లక్ష్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆపదలో మమ్మల్ని ఆదుకుని మా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పింఛన్ పెంచిన కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆరే రావాలి.
– బోగరాజు జానీ, రేగట్టె, కనగల్ మండలం