జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారం రోజుల్లో పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,213మందికి ప్రయోజనం కలుగనున్నది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అన్ని బెనిఫిట్స్ వర్తించనున్నాయి. త్వరలో దీనిపై విధి విధానాలు కలెక్టర్
ఆధ్వర్యంలో నిర్ణయించనున్నారు. అలాగే వీఆర్ఏలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. అర్హతలు, సామర్థ్యాలను బట్టి నీటి పారుదల శాఖతో పాటు ఇతర శాఖలకు బదిలీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,903 మంది వీఆర్ఏలు ఉన్నారు. సర్కారు
ప్రకటనతో జేపీఎస్లు, వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నల్లగొండ, జూలై 12
నల్లగొండ, జూలై 12 : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ప్రొబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్లను రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు బుధవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఉద్యోగుల లాగానే బెనిఫిట్స్ అందనున్నాయి. రెగ్యులరైజేషన్ తర్వాత వారు గ్రామాల్లో ఏయే పనులు చేయాలనే విషయమై విధి విధానాల రూపకల్పనపై కలెక్టర్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్ట్ అధికారి, ఎస్పీ కమిటీ సభ్యులుగా ఉండి నిర్ణయించనున్నారు.
నల్లగొండ జిల్లాలో 648 మంది
పల్లెలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రతి పల్లెల్లో పంచాయతీ కార్యదర్శి ఉండాలనే ఆలోచనతో 2019 ఏప్రిల్ 12న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. అప్పుడు వారికి రూ.15వేల వేతనంతో మూడండ్లే ప్రొబేషనరీ పీరియడ్ను పెట్టింది. తర్వాత 2022 ఏప్రిల్ 12న వారి వేతనాన్ని రూ.29వేలకు పెంచడంతో పాటు మరో ఏడాది ప్రొబేషనరీ కాలం పెంచింది. ఆ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 12తో పూర్తి కావటంతో ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా వారిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో నల్లగొండ జిల్లాలోని 648 మంది, సూర్యాపేట జిల్లాలోని 335 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ కానున్నారు. వీరితో పాటు మరో 82 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులను కూడా త్వరలో రెగ్యులర్ చేసే అవకాశం ఉంది. గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కార్యదర్శులు చిత్తశుద్ధితో పని చేయటంతో పలు గ్రామాలకు కేంద్రం ఉత్తమ పంచాయతీ ఆవార్డులను ఇచ్చింది. జేపీఎస్ల కృషితోనే ఇది సాధ్యమైనందున వారిని వారంలోగా రెగ్యులరైజ్ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు సీఎస్ శాంతికుమారి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలను ఆదేశించారు.
విధివిధానాలకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ
ఇప్పటి వరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉన్నందున వీరికి పెద్దగా బాధ్యతలు అప్పగించలేదు. వీరిని క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విధి విధానాలు పూర్తిస్థాయిలో రూపొందించనున్నారు. ఇందుకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీ శాఖ కమిషనర్ సందీప్కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలనలో జిల్లా కమిటీ పని చేయనుంది. జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్, ఫారెస్ట్ అధికారి, ఎస్పీతో పాటు డీపీఓలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
వీఆర్ఏల సర్దుబాటు
రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేయలని సీఎం కేసీఆర్ కేబినేట్ సబ్ కమిటీతో పాటు సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ఇప్పటికే వారిని రెగ్యులర్ చేయగా వారితో చర్చలు జరిపి నీటి పారుదల శాఖతో పాటు ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం ఆదేశించారు. వీఆర్ఏల అర్హతలు, సామర్థ్యాలను బట్టి సర్దుబాటు చేయాలని ఆదేశించారు. సీఎం నిర్ణయంతో నల్లగొండ జిల్లాలో 798 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 659 మంది, సూర్యాపేట జిల్లాలోని 446 మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరనుంది.
ఇక ప్రభుత్వ ఉద్యోగులుగానే బెనిఫిట్స్..
ప్రభుత్వం జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తున్న నేపద్యంలో ఇక నుండి వీరికి ప్రభుత్వ ఉద్యోగులు గానే బెనిఫిట్స్ అందనున్నాయి. తొలుత వీరికి రూ.15 వేల వేతనం ఇవ్వగా ప్రస్తుతం వీరికి నెలకు రూ.29వేల వేతనం అందుతుండగా అందులో సుమారు 19వేలు బేసిక్ ఉంటుంది. ఈ బేసిక్లో ఇక నుండి హెచ్ఆర్ఏ, డీఏ లాంటి అలవెన్సులతో పాటు ఈహెచ్ఎస్, కారుణ్యం లాంటి సౌకర్యం ఉండనుంది. ఇక వీరి వేతనంలో పీఎఫ్ కూడా కట్ కానుంది. ఈ నేపద్యంలో ఇక నుండి అన్ని అలవెన్సులు కలుపుకోని మరో మూడు నాలుగు వేల దాకా జీతం పెరిగే అవకాశం ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 230 మంది
యాదాద్రి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు 301మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 53 మంది ఓపీఎస్లు, 67 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇందులో 230 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తైన వారు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరు రెగ్యులరైజ్ కానున్నారు.
ప్రభుత్వం నిర్ణయం సంతోషకరం
ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. నాలుగు సంవత్సరాలుగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు మేము కృషి చేశాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం. మా కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– కొండపురం అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి, ఎర్రంబల్లి
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
నాలుగు సంవత్సరాలుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాను. మమ్ములను రెగ్యులర్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసినం. మమ్ములను రెగ్యులర్ చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ఆరె.రాజు, తుక్కాపురం, పంచాయతీ కార్యదర్శి
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
నాలుగేండ్లుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మొదట ప్రొబేషనరీ పీరియడ్తో తీసుకున్న ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయటం సంతోషంగా ఉంది. మొదట రూ.15 వేల జీతం ఉండగా దానిని రూ.29వేలకు పెంచి ప్రస్తుతం రెగ్యులర్ చేసింది. సీఎం కేసీఆర్ సార్కు రుణ పడి ఉంటాం.
-బొడ్డు కాశీం, ఉడతలపల్లి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, చండూర్ మండలం