నీలగిరి, సెప్టెంబర్ 13 : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ జీఓ విడుదల చేసింది. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 401 మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ కానున్నాయి. అంగన్వాడీ టీచర్లు. హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచింది. పదవీ విరమణ అనంతరం ఆసరా పింఛన్ మంజూరు చేయనున్నట్లు జీఓలో పేర్కొంది.
ఉద్యోగ విరమణ చేసే సమయంలో ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏండ్ల లోపు ఉన్న టీచర్లకు, హెల్పర్లకు రూ. 2లక్షల ఇన్సూరెన్స్, 50 ఏండ్లు దాటిన వారికి రూ. 2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించేలా యాప్ను రూపొందించనున్నారు. దురదృష్టవశాత్తు సర్వీసులో ఉండి చనిపోతే తక్షణ సాయంగా టీచర్కు రూ. 20వేలు, హెల్పర్కు రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలోని 8, 033 మందికి లబ్ధి చేకూర నుంది. ప్రభుత్వ జీఓ విడుదల చేయడం పట్ల మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, మంత్రి సత్యవతిరాథోడ్కు కృతజ్ఞతలు తెలిపారు.