భువనగిరి కలెక్టరేట్, మార్చి 23 : రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగు ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 196 గ్రామాలు, 64 మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు విజయవంతంగా పూర్తయ్యింది. జిల్లాలోని 421 గ్రామపంచాయతీలు, 6 మున్సిపాలిటీల్లో కలిపి కంటి వెలుగు లక్ష్యాన్ని 6,17,021 నిర్దేశించగా, అందులో ఇప్పటికే 1,66,100 మందికి కంటి పరీక్షలు చేసి 47 శాతాన్ని అధిగమించారు. 100 రోజుల పని దినాల్లో భాగంగా ఇప్పటికే 44 రోజుల కార్యక్రమం పూర్తయ్యింది. ఇప్పటి వరకు 28,317మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేయడంతోపాటు 9,795 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందించి 21,923 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కాగా, జూన్ 15 వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
మోత్కూరు, మార్చి 23 : అంధత్వ నివారణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాటిమట్లలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గొప్పదని పేర్కొన్నారు. ప్రజలంతా కంటి వెలుగును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రచ్చ కల్పన, నార్మాక్స్ డైరెక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ మల్లేశ్, డాక్టర్ హేమంత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.