నీలగిరి, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం కండ్ల సంబురంగా కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఐదో రోజు 19,553 మందికి కంటి పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 1,00,309 మందికి పరీక్షలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 74 క్యాంపుల ద్వారా ప్రజలను స్కీనింగ్ చేస్తూ అవసరం ఉన్న వారికి అక్కడిక్కడే కండ్లద్దాలు అందజేస్తున్నారు. బుధవారం 9,369 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 6,671 మంది దగ్గర, దూరపు చూపు కాకుండా ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 1,664 మందికి దగ్గర చూపు అద్దాలు అందజేశారు. కాగా ఇప్పటి వరకు 47,893 మందికి కంటి వెలుగు పరీక్షలు చేసి చేశారు. అద్దాలు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు ఆఫీసర్లు, కో ఆర్డినేటర్లు, ఆఫ్తమాలజిస్టులు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో&
యాదాద్రి భువనగిరి : జిల్లా వ్యాప్తంగా 34 బృందాలతో 27 గ్రామాలు, 7 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 20,844 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 11,012మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు తేలింది. 5,913 మందికి రీడింగ్ అద్దాలు ఇవ్వగా, 3,959 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ పెట్టారు. బుధవారం 3,861 మందికి కంటి పరీక్షలు చేయగా, ఇందులో 937 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. 587మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ పెట్టారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట : జిల్లా వ్యాప్తంగా బుధవారం 6,323 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,718 మందికి రీడింగ్ అద్దాలు ఇవ్వగా, 789 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు. 3,353 మందికి మెడిసిన్ అందించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం చింతలపాలెంలో జరుగుతున్న కంటి వెలుగును పరిశీలించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 31,572 మందికి కంటి పరీక్షలు చేశారు.
వృద్ధులకు ఎంతో ఉపయోగకరం
కంటి సమస్యలు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడం సంతోషంగా ఉంది. కండ్లు కనిపించని వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. పేదలు ప్రైవేటు దవాఖానలకు పోయి పరీక్షలు చేయించుకోలేరు. ఆర్థికస్థోమత లేక అవస్థలు పడుతారు. నేను కూడా కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నా. పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-పోరెడ్డి కళమ్మ, నేరేడుచర్ల
మా ఊరికే వచ్చి అద్దాలివ్వం సంతోషకరం
రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. స్వతహాగా మా ఊరిలోనే కంటి వెలుగు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు చేశారు. అంతేకాకుండా కంటి అద్దాలు కూడా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో కంటి అద్దాలు తెచ్చుకోవాలని చూస్తున్నాను. సర్కారే పైసా ఖర్చులేకుండా మంచి కండ్ల అద్దాలు ఇవ్వడంతో ఇప్పుడు కండ్లు బాగా కనిపిస్తున్నాయి.
-కందారపు లక్ష్మి, ఆత్మకూరు(ఎం)
కండ్ల మసక తొలగిపోయింది
నాకు కొంత కాలంగా కండ్లు మసక మసకగా కనిపిస్తున్నాయి. ఎన్నో సార్లు ప్రైవేట్ దవాఖానకు పోయిన. డాక్టర్లు పరీక్షలు చేసి మందులు ఇచ్చి వాడమన్నరు. అయినా సరిగా కండ్లు కనిపించడం లేదు. మసకలతోనే ఇబ్బంది పడుతున్నా. ప్రభుత్వం మా గ్రామంలో కంటి పరీక్షలు చేస్తున్నదని తెలుసుకొని ఇక్కడి వచ్చిన. వైద్యులు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కండ్లద్దాలతోపాటు మందులు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయి. ప్రభుత్వం పల్లెల్లోనే కంటి వెలుగు నిర్వహించడం సంతోషంగా ఉంది.
-పురుగుల సమ్మయ్య, మోత్కూరు