వారం రోజులుగా కురిసిన వరుస వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలకళ ఉట్టిపడుతున్నది. వరద ప్రవాహంతో చేపలు ఎదురెక్కి వస్తున్నాయి. దాంతో గ్రామాల్లో చేపల వేట జోరుగా కొనసాగుతున్నది చెరువులు, కుంటల వద్ద ఎక్కడా చూసినా మత్స్యకారులు చేపలు పడుతున్న దృశ్యాలే కనపడుతున్నాయి. సామాన్య జనం సైతం గాలాలు, వలలు వేస్తూ చేపలు పడుతున్నారు. కొర్రమట్ట, బంగారు తీగ, రవ్వ, బొచ్చ, జెల్లలు, పాంప్లెట్లు తదితర చేపలు దొరుకుతున్నాయి. చేపల రకాన్ని బట్టి కిలో రూ.50 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. మార్కెట్లు కూడా చేపల విక్రయాలతో కళకళలాడుతున్నాయి. దాంతో ఏ ఇంట్లో చూసినా చేపల కూరే వండి ఆస్వాదిస్తున్నారు. మరో వైపు విరివిగా దొరుకుతున్న చేపలతో ఎప్పుడూ తినే చికెన్, మటన్పై జనం ఆసక్తి చూపించడంలేదు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను బలోపేతం చేయడం, ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయడంతో నేడు ఎక్కడా చూసినా పుష్కలంగా చేపలు లభ్యమవుతున్నాయి. మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పడుతున్నాయి.
– తిరుమలగిరి/సూర్యాపేట అర్బన్/జూలై 29
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు ప్రవహించడంతో చేపల పంట పండుతున్నది. వరదల తాకిడికి ఇతర ప్రాంతాల నుంచి మీనాలు రావడంతో గ్రామాల్లో జోరుగా చేపల వేట కొనసాగుతున్నది. కాల్వలు, కుంటల వద్ద సామాన్య జనం సైతం చేపలు పడుతున్నారు. దీంతో మత్స్యకారులకు చేతి నిండా పని లభిస్తున్నది. నిత్యం 2వేల నుంచి 3వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురువడంతో 1500కు పైగా
చెరువులు, కుంటలు దాదాపుగా నిండాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసింది. అవి పెద్దవై వరదలకు ఎదురెక్కుతుండగా.. పట్టుకునేందుకు వచ్చిన ప్రజలు, మత్స్యకారులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. సూర్యాపేట, మూసీ పరీవాహక ప్రాంతం, గరిడేపల్లి, హుజూర్నగర్, కోదాడ, మునగాల, తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్ మండలాలతోపాటు కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో అధిక ఇండ్లల్లో చేపల కూరే. చేపలు పుష్కలంగా లభిస్తుండడంతో వ్యాపారులు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో మాంసంప్రియులు చికెన్, మటన్ వైపు చూడడంలేదు.
మార్కెట్లు కళకళ.. మత్స్యకారులకు పండుగ
వరుస వర్షాలు మత్స్యకారులకు పండుగను తీసుకొచ్చాయి. ఆలస్యంగా వర్షాలు కురిసినా.. ఇటు రైతులు, అటు మత్స్యకారులకు ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. మత్స్యకారులు చెరువుల్లో ఉన్న చేపలు పట్టి మార్కెట్లలో విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లు చేపలతో కళను సంతరించుకున్నాయి. చేపలు అమ్మేచోట కోలాహలం నెలకొంటున్నది. బంగారు తీగలు, రవ్వలు, బొచ్చలు, జెల్లలతోపాటు కొర్రమట్టలు దొరుకుతున్నాయి. చేపల రకాన్ని బట్టి కిలో రూ.50 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. అయితే.. గతంలో ఆదివారం వస్తుందంటేనే జిల్లాకు అవసరమైన చేపలను వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు స్థానికంగానే పుష్కలంగా లభిస్తుండడంతో చేపలను దిగుమతి చేసుకోవడం ఆపివేశారు.
నో చికెన్, నో మటన్.. ఓన్లీ ఫిష్
ఇటీవలి కాలంలో చికెన్, మటన్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో మాంసం కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్ ఏకంగా కిలో రూ.250 దాకా పలుకుతున్నది. మటన్ రూ.800 నడుస్తున్నది. పైగా చికెన్, మటన్ ఎప్పుడూ తినేదే కావడంతో మాంసంప్రియులు వాటిపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఇటీవల వరుస వర్షాలతో తాజా చేపలు దొరుకుతుండడంతో అధిక శాతం మంది చేపలపైనే మక్కువ చూపుతున్నారు. దీంతో ఊర్లల్లో ఏ ఇంట్లో చూసినా చేపల కూరే కనిపిస్తున్నది. గ్రామాల్లో సామాన్య జనం సైతం వాగులు, కాల్వలు, కుంటల వద్ద చేపలు పడుతుండగా.. మార్కెట్లో గిరాకీ తగ్గిందని, జిల్లా కేంద్రంలోని లైవ్ ఫిష్ కేంద్రాల్లో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెప్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 578 చెరువుల్లో చేపల పెంపకం
మత్య్సకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. సూర్యాపేట జిల్లాలో 848 చెరువులు ఉండగా.. ఈ పథకం కింద 578 చెరువుల్లో 243.81 లక్షల చేప పిల్లలను వదిలింది. దీంతో ప్రతి ఏటా 520 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుండగా.. కోట్లల్లో ఆదాయం వస్తున్నది. జిల్లాలో 140కి పైగా ఉన్న మత్స్య సహకార సంఘాల్లోని 15,847 మంది సభ్యులు జీవనోపాధి పొందడంతోపాటు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. అదేవిధంగా చేపలను తరలించడానికి, ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవడానికి 70 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, మినీ డీసీఎంలు, చేపల వేటకు అవసరమైన పరికరాలను అందిస్తున్నది. కాగా, రాష్ట్రంలో ఏటా 520 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుండగా.. ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తూ మత్స్యకారులు లాభాలు గడిస్తున్నారు.